KTR | కపటనీతికి మారుపేరు కాంగ్రెస్

పటనీతికి మారుపేరు కాంగ్రెస్ పార్టీ అని మరోసారి బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు

  • Publish Date - April 19, 2024 / 02:22 PM IST

ట్విటర్ వేదికగా కేటీఆర్ ఫైర్
నిరుద్యోగులను మోసం చేస్తుందని ధ్వజం

విధాత, హైదరాబాద్ : కపటనీతికి మారుపేరు కాంగ్రెస్ పార్టీ అని మరోసారి బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ట్విటర్ వేదికగా నిరుద్యోగ సమస్యపై స్పందిస్తూ అన్ని వర్గాల ప్రజలకు.. ముఖ్యంగా యువతకు అరచేతిలో వైకుంఠం చూపించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. తమ 120 రోజుల పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులతో సహా అందరికీ ద్రోహం చేయడం ప్రారంభించిందని కేటీఆర్ విమర్శించారు.

ప్రియాంక గాంధీ వంటి కాంగ్రెస్ అగ్రనాయకులు అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు రూ. 4,000 నిరుద్యోగ భృతి అందిస్తామని హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక.. అసలు అటువంటి హామీ ఏమివ్వలేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట మార్చారని కేటీఆర్‌ ఆరోపించారు. ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అన్ని వార్తాపత్రికల మొదటి పేజీలో తమ జాబ్ క్యాలెండర్‌ గురించి ప్రకటనలు ఇచ్చిందని, వాస్తవానికి బీఆరెస్‌ హయాంలో భర్తీ చేసిన 30 వేల ఉద్యోగాలకు కేవలం నియామక పత్రాలను ఇచ్చి ఆ ఉద్యోగాలను నిస్సిగ్గుగా తమ ఖాతాలో కాంగ్రెస్‌ వేసుకుంటోందని తప్ఫుబట్టారు.

అన్ని పోటీ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, కానీ తాము ఇచ్చిన హామీపై నిస్సిగ్గుగా యూ టర్న్ తీసుకుంటూ.. కాంగ్రెస్ ప్రభుత్వం టెట్ పరీక్ష ఫీజును రూ. 400 నుండి రూ. 2000 లకు (2 పేపర్లకు) పెంచిందని ఆరోపించారు. బల్మూరి వెంకట్ వంటి కాంగ్రెస్ నాయకులను ఎన్నో కోర్టు కేసులు వేసి.. అనేక పోటీ పరీక్షలు రద్దవ్వడానికి కారణమయ్యారని, నిరుద్యోగుల ఉసురు పోసుకుని, ప్రతిఫలంగా వెంకట్ ఎమ్మెల్సీ పదవిని అందుకున్నాడు కానీ.. ప్రభుత్వ ఉద్యోగ ఆశావహులను మాత్రం దిక్కుతోచని స్థితిలో కాంగ్రెస్ వదిలేసిందన్నారు. కాంగ్రెస్ అసలు రంగు ఇప్పుడిప్పుడే బయటపడుతోందని, తమని నట్టేట ముంచిన కాంగ్రెస్‌ పార్టీకి నిరుద్యోగ యువత గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చిందని కేటీఆర్ తెలిపారు.

Latest News