Site icon vidhaatha

CM Revanth Reddy | ఉద్యోగ సంఘాలు ఉండాల్సిందే


హైదరాబాద్‌ : రాష్ట్రంలో 95 శాతం మంది ఉద్యోగులు నిజాయితీగా పనిచేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం సంఘాలపై కక్షగట్టి వాటిని రద్దు చేస్తే.. ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేశారని వ్యాఖ్యానించారు. ఉద్యోగులకు శాఖలవారీగా సంఘాలు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ఎంసీహెచ్ఆర్డీలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం సాయంత్రం సమావేశమయ్యారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్లుగా ఉద్యోగులు తమ సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం రాలేదని, వారి ఆవేదన వినేవారు లేక ఇబ్బందులు పడ్డారని అన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే ఉద్దేశంతోనే తమ పార్టీ వాటిని ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపర్చిందని తెలిపారు. వాటిని వాటిని పరిష్కరించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు. మంత్రివర్గ ఉపసంఘం శాఖలవారీగా సమావేశం నిర్వహించి నిర్ణయాలు తీసుకుంటుందన్న ముఖ్యమంత్రి.. సంఘాలతో చర్చించకుండా నిర్ణయాలు తీసుకోబోమని చెప్పారు.


ఇన్నాళ్లు సంఘాలకు గౌరవ అధ్యక్షులుగా ఉన్నది, అధికారంలో ఉన్నది కేసీఆర్ కుటుంబమేనని అన్నారు. నిర్బంధాలతో పాలన సాగిస్తామనుకోవడం వారి భ్రమ అని విమర్శించారు. సమస్యలకు పరిష్కారం నిర్బంధాలు కాదని, చర్చలేనని ముఖ్యమంత్రి చెప్పారు. ఉద్యోగులకు విశ్వాసం కల్పించడానికే వారితో చర్చలు జరిపామని తెలిపారు. ఇప్పటికే సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించామన్నారు.


ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు ఉచితంగా విద్యుత్తు అందించే బాధ్యత తమ ప్రభుత్వానిదని రేవంత్‌ హామీ ఇచ్చారు. దీనిపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో కిందిస్థాయి సిబ్బందిని నియమిస్తామని తెలిపారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ఉద్యోగుల తరపున ప్రాతినిధ్యం ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.


నెత్తురు చిందితేనే తెలంగాణ వచ్చింది


తెలంగాణ రాష్ట్రాన్ని ఏ ఒక్క రాజకీయ పార్టీ తామే సాధించామని చెప్పుకున్నా అది అసంబద్ధమని రేవంత్‌రెడ్డి చెప్పారు. విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల పోరాటంతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని గుర్తు చేశారు. రక్తం చిందించకుండా తెలంగాణ సాధించామని కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడారని అన్నారు. ‘కేసీఆర్ కుటుంబంలో ఎవరి రక్తం చిందలేదేమో కానీ.. తెలంగాణ కోసం కానిస్టేబుల్ కిష్టయ్య లాంటి వారు రక్తాన్ని చిందించారు.. శ్రీకాంతాచారి లాంటి వారు మాంసపు ముద్దలయ్యారు’ అని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు.


తెలంగాణ బాపు జయశంకర్‌ సారే


కేసీఆర్‌ తెలంగాణ బాపు అని తనకు తానే చెప్పుకుంటున్నారని రేవంత్‌ ఎద్దేవా చేశారు. అలా చెప్పుకోవడానికి కనీస పోలిక ఉండాలన్నారు. తెలంగాణ బాపు సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ అని స్పష్టం చేశారు. తెలంగాణ ఆత్మను గౌరవించకపోతే సమాజం మనల్ని క్షమించదని చెప్పారు.


ఆదాయం పడిపోయింది


తెలంగాణలో ఆదాయం పడిపోయిందని, ఆదాయం కోసం కేవలం లిక్కర్ పైనే ఆధారపడేలా కేసీఆర్ పాలన సాగిందని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. మొదటి తారీఖున ఉద్యోగులకు జీతాలు వేసినా తాము ప్రచారం కల్పించుకోలేదని చెప్పారు. మూడు నెలల్లో 30వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, ఒక్కో చిక్కుముడిని విప్పుతూ ఉద్యోగాల భర్తీని ముందుకు తీసుకెళుతున్నామని తెలిపారు. 11వేల పైచిలుకు ఉద్యోగాలతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. రోజుకు 18 గంటలు పని చేస్తూ పాలనను గాడిలో పెడుతున్నామని చెప్పారు.


మాది అల్లాటప్పా ప్రభుత్వం కాదు


తమ ప్రభుత్వం మూడు నెలలు ఉంటది.. ఆరు నెలలు ఉంటదని కొందరు మాట్లాడుతున్నారన్న రేవంత్‌రెడ్డి.. ‘తమాషా అనుకుంటున్నారా? మేం అల్లాటప్పాగా అధికారంలోకి రాలేదు.. ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వం.. పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉండటం ఖాయం’ అని తేల్చి చెప్పారు. ప్రజాస్వామ్యంపై గౌరవం, విశ్వాసం ఉంచాలని ప్రతిపక్ష నేత కేసీఆర్‌కు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. వివిధ శాఖల్లో ఉన్న 1100 మంది రిటైర్డ్ ఉద్యోగుల కొనసాగింపుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.


కోదండరాం సార్‌ మండలికి ఖాయం


గవర్నర్‌తో మాట్లాడి కోదండరాం సార్‌ను శాసన మండలికి పంపుతామని ముఖ్యమంత్రి చెప్పారు. ఆయన ఎమ్మెల్సీగా ఉంటే శాసన మండలికి గౌరవం అని వ్యాఖ్యానించారు. ఉద్యోగుల డీఏతో పాటు ఇతర అంశాలపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Exit mobile version