Site icon vidhaatha

ఉమ్మడి వరంగల్ జిల్లాలో 60వేల ఎకరాల్లో పంట నష్టం

అకాల వర్షం అపార నష్టాన్ని కలిగించింది. వడగండ్లు రైతులకు కడగండ్లు మిగిల్చాయి. ప్రకృతి ప్రకోపించింది. రైతులు తీరని నష్టాలలో కూరుకుపోయారు. అధికారులు నష్టాలు అంచనా వేస్తున్నారు. ములుగు, భూపాల్ పల్లి, జనగామ, వరంగల్, హనుమకొండ, మానుకోట జిల్లాల్లో రైతులు కోలుకోలేని పరిస్థితి నెలకొంది. పంట నష్టం ప్రాథమిక అంచనా వేసే దశలో అధికారులు ఉన్నారు.అనధికార ప్రాథమిక అంచనాల ప్రకారం 60 వేల ఎకరాల్లో పంటనష్టం జరిగిందని అంచనా.

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఉమ్మడి వరంగల్ జిల్లాలో శనివారం రాత్రి కురిసిన వడగండ్ల వానకు పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. దాదాపు 60 నుంచి 70 వేల ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. దాదాపు పంటచేలళ్లలో ఉన్న ఏ పంట చేతికి రాకుండా పోయింది. కోత దశలో ఉన్న మిర్చి కళ్ళల్లో ఆరబోసిన మిర్చి పూర్తిగా నాశనమైంది.

పండ్ల తోటలు కూరగాయ తోటలు సర్వనాశనం అయ్యాయి. మొక్కజొన్న తదితర పంటలు నేలరాలి పోయాయి. అనధికార ప్రాథమిక అంచనాల ప్రకారం 60 వేల ఎకరాల్లో పంటనష్టం జరిగిందని అంచనా. ఈ నివేదికలు ప్రాథమిక అంచనాలు మాత్రమే, ఇంకా సర్వే జరుగుతుంది. పూర్తి నివేదిక వచ్చిన తర్వాత స్పష్టమైన పంట నష్టం వివరాలు తెలియనున్నది.

జనగామ జిల్లాలో పంట నష్టం

జనగామ జిల్లాలో 9 మండలాలు 67 గ్రామాలు తీవ్రంగా నష్టానికి గురయ్యాయి. 3950 ఎకరాల విస్తీర్ణంలో వరి, 1600 ఎకరాల విస్తీర్ణంలో మొక్కజొన్న, 375 ఎకరాల విస్తీర్ణంలో మిర్చ, 25 ఎకరాల విస్తీర్ణంలో జొన్న, 25 ఎకరాల విస్తీర్ణంలో పొగాకు, 50 ఎకరాల విస్తీర్ణంలో మామిడి, వంటి పంటలు మొత్తం జిల్లాలో దాదాపు 6500 ఎకరాల విస్తీర్ణంలో పంటల నష్టాలు జరిగాయని ప్రాథమిక అంచనాకు వచ్చారు.

మానుకోట జిల్లాలో నష్టం వివరాలు

మహబూబాబాద్ జిల్లాలో 12 మండలాలు 250 గ్రామాల్లోని వివిధ రైతులు పంట నష్టాలకు గురయ్యారు. 4800 ఎకరాలలో వరి, 6600 ఎకరాల విస్తీర్ణంలో మొక్కజొన్న, 3500 ఎకరాల విస్తీర్ణంలో మిర్చి, 2500 ఎకరాల విస్తీర్ణంలో మామిడి, మొత్తం జిల్లాలో 17400 ఎకరాల విస్తీర్ణం వివిధ పంటల నష్టం సంభవించినట్లు ప్రాథమిక అంచనా వేశారు.

ములుగు జిల్లా రైతులను ముంచిన అకాల వర్షం

ములుగు జిల్లా మంగపేట గోదావరి తీర ప్రాంత గ్రామాల్లో వేలాది ఎకరాల్లో మిర్చి పంట నీటిపాలైంది మంచి కోత దశకు వచ్చిన స్థితిలో నష్టం వాటిల్లి లక్నవరం రామప్ప గణపురం ఆయకట్టు ప్రాంతాల్లోని వరి పంట దెబ్బతింది. ఎనిమిది నుంచి తొమ్మిది వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేస్తున్నారు.

వరంగల్ జిల్లాలో

వరంగల్ జిల్లాలో దాదాపు 11వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అనధికార అంచనా జిల్లాలోని నర్సంపేట వర్ధన్నపేట పరకాల ప్రాంతాలలో తీవ్రంగా పంటలు దెబ్బతిన్నాయి దాదాపు నష్టపోయాయి. హనుమకొండ జిల్లా పరిధిలోని గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది.

పాలకుర్తి నియోజకవర్గంలో

పాలకుర్తి నియోజకవర్గంలో ఆరు మండలాల్లో 76 గ్రామాలు అకాల వడగండ్ల వర్షానికి నష్టపోయాయి. 15వేల ఎకరాలలో పంట నష్టాలు జరిగాయి. దాదాపు పదివేల మంది రైతులు పంట నష్టాలకు గురయ్యారు. తొర్రూరు మండలంలో* అత్యధికంగా 19 గ్రామాలలోని 2000 మంది రైతులు 6000 ఎకరాల విస్తీర్ణంలో వరి మొక్కజొన్న మామిడి మిర్చి వంటి పలు పంటలు నష్టపోయారు.

Exit mobile version