- 35 మంది విద్యార్ధినులకు అస్వస్థత
- 15 మందికి వాంతులు, విరోచనాలు
- జిల్లా హాస్పిటల్లో చికిత్స
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మహబూబాబాద్ (Mahbubabad) జిల్లా కేంద్రంలోని కస్తూర్బా గాంధీ (Kasturba Gandhi) స్కూల్లో ఫుడ్ పాయిజన్ (Food poisoning)తో 35 మంది విద్యార్థినులు గురువారం ఉదయం అస్వస్థకు గురయ్యారు. రాత్రి టమాటా కూరతో అన్నం తిన్న విద్యార్థినులు ఉదయం అస్వస్థతకు గురయ్యారు. 15 మంది విద్యార్థినిలకు వాంతులు, విరోచనాలు కావడంతో పరిస్థితిని గమనించిన టీచర్లు జిల్లా హాస్పిటల్కు తరలించారు. విద్యార్థినులను పరీక్షించిన డాక్టర్లు ఫుడ్ పాయిజన్ అయిందని నిర్ధారించారు. ప్రస్తుతం విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు.
బయటికి పొక్కకుండా జాగ్రత్త
కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ఫుడ్ పాయిజన్ ఘటనకు ప్రిన్సిపాల్, టీచర్ల నిర్లక్ష్యం కారణమని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నిన్న రాత్రి కలుషిత ఆహారం తిని విద్యార్థినులు అస్వస్థతకు గురికాగా అప్రమత్తమైన టీచర్లు విషయం బయటకు పొక్కొద్దనే ఉద్దేశంతో డాక్టర్లను పిలిపించి పాఠశాలలో విద్యార్థినులకు సీక్రెట్గా ట్రీట్మెంట్ అందించినట్లు సమాచారం.
పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి
పరిస్థితి విషమిస్తుండటంతో ఆందోళనలకు గురైన ప్రిన్సిపాల్, టీచర్లు ఉదయం ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. కాగా ఈ సంఘటనపై విద్యార్థి సంఘాలు భగ్గమంటున్నాయి. దవాఖానలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను మహబూబాబాద్ మున్సిపల్ కమిషనర్ పరామర్శించారు. మెరుగైన వైద్య అందించాలని డాక్టర్లను ఆదేశించారు.