High Court |
- గతేడాది ఆదేశాలే కొనసాగుతాయి..
- నిమజ్జనం చేసినట్లు ఆధారాలుంటే..
- కోర్టు ధిక్కరణ పిటిషన్ వేయండి
- న్యాయవాది వేణుమాధవ్ను ఆదేశించిన తెలంగాణ హైకోర్టు
- తదుపరి విచారణను 25కు వాయిదా వేసిన ధర్మాసనం
విధాత, హైదరాబాద్ : గతేడాది కోర్టు జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘించి హుస్సేన్ సాగర్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పీఓపీ)తో తయారు చేసిన వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారన్న ఆధారాలుంటే.. కోర్టు ధిక్కరణ పిటిషన్ వేయాలని న్యాయవాది వేణుమాధవ్ను హైకోర్టు ఆదేశించింది. సరైన ఆధారాలతో పిటిషన్ వేస్తే చర్యలు తీసుకుంటామని వ్యాఖ్యానించింది.
పీవోపీతో తయారు చేసిన విగ్రహాలను హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయొద్దని గతేడాది ఇదే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని.. అవే ఆదేశాలు ఈసారి కూడా కొనసాగుతాయలని తేల్చిచెప్పింది. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన చిన్నచిన్న కొలనుల్లో మాత్రమే పీఓపీ విగ్రహాలను నిమజ్జనం చేయాలన్న మధ్యంతర ఉత్తర్వులు ఇంకా అమల్లోనే ఉన్నాయని పేర్కొంది.
పీఓపీతో తయారు చేసే విగ్రహాలపై నిషేధం ఎత్తివేయాలని, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) నిబంధనలను కొట్టివేయాలని కోరుతూ ధూళిపేటకు చెందిన తెలంగాణ గణేశ్ మూర్తి కళాకారుల సంక్షేమ సంఘంతో పాటు మరికొందరు హైకోర్టులో 2022లో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రావణ్కుమార్ ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ హరేందర్ పరిషద్ వాదనలు వినిపిస్తూ.. పీవోపీ విగ్రహాలను హుస్సేన్సాగర్లో నిమజ్జనం చేయలేదని, తాత్కాలిక కొలనుల్లో చేశామన్నారు.
అనంతరం న్యాయవాది వేణుమాధవ్ వాదనలు వినిపించారు. కోర్టు ఆదేశాలున్నా, కేంద్ర నిబంధనలున్నా పీవోపీ విగ్రహాలను హుస్సేన్సాగర్లో నిమజ్జనం చేశారని చెప్పారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. ఆధారాలతో పిటిషన్ వేస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నది. తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది.