విధాత: పార్లమెంటు వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల చిట్టాను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2019తో పోలిస్తే సుమారు రెండింతలు అప్పులు పెరిగాయని రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. 2019లో రాష్ట్ర అప్పులు రూ. 2,64,451 కోట్లు ఉండగా..
2020లో రూ. 3,07,671 కోట్లు, 2021లో 3,53,021 కోట్లు, 2022 సవరించిన అంచనాల తర్వాత రూ.3,39,718 కోట్లు, 2023 బడ్జెట్ అంచనాల ప్రకారం ప్రస్తుత ఏపీ అప్పు రూ. 4,42,442 కోట్లుగా ఉన్నది. ఏటా ఆంధ్రప్రదేశ్ దాదాపు రూ. 45 వేల కోట్లు అప్పులు చేస్తున్నదని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి తెలిపారు.
అప్పు రత్నఅవార్డు ఇవ్వాలి: పవన్
ఏపీ అప్పులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్.. జగన్ ప్రభుత్వంపై ట్విట్టర్లో సెటైర్ వేశారు. ‘అప్పులతో ఏపీ పేరు మారుమోగిస్తున్నందుకు సీఎం జగన్కు ప్రత్యేక శుభాకాంక్షలు. అప్పులతో ఆంధ్ర పేరును ఇలాగే కొనసాగించండి. మీ వ్యక్తిగత ఆస్తులు పెంచుకోవడం మాత్రం మరిచిపోవద్దు. రాష్ట్రాభివృద్ధి సంపదను కుక్కలకు వదిలేయండి. భారతరత్న మాదిరిగా అప్పురత్న అవార్డు ఇవ్వాలి’ అని పవన్ ఎద్దేవా చేశారు.
అప్పులతో ‘ఆంధ్ర’ పేరు మారుమోగిస్తున్నందుకు,ముఖ్యమంత్రి కి నా ప్రత్యేక శుభకాంక్షలు ..keep it up