Ayodhya | ఉత్తరప్రదేశ్లో ఇటీవల జరిగిన మేయర్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. యూపీలోని 17 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించగా, అన్నింటిలోనూ బీజేపీనే గెలుపొందింది. దీంతో అన్ని మేయర్ పీఠాలను బీజేపీనే కైవసం చేసుకుంది.
అయితే అయోధ్య కార్పొరేషన్లో మాత్రం ఓ మ్యాజిక్ జరిగింది. హిందువులు ఎక్కువగా ఉన్న వార్డులో ముస్లిం అభ్యర్థి గెలుపొందాడు. ఆయన ఏ పార్టీ నుంచి కూడా పోటీ చేయలేదు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించాడు.
అయోధ్య కార్పొరేషన్లో మొత్తం 60 వార్డులు ఉన్నాయి. 27 వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించగా, 17 వార్డుల్లో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. మరో 10 స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన సుల్తాన్ అన్సారీ అనే యువకుడు అభిరామ్ దాస్ వార్డు నుంచి పోటీ చేసి గెలుపొందాడు.
అయితే ఈ వార్డులో హిందువుల ఓట్లు 3,844 కాగా, ముస్లింల ఓట్లు కేవలం 440. కానీ, అయోధ్య కార్పొరేషన్ ఎన్నికల్లో సుల్తాన్ అన్సారీ ఘన విజయం సాధించాడు. ఇది హిందూ-ముస్లిం సౌభ్రాతృత్వానికి ప్రతీక అని అన్సారీ పేర్కొన్నాడు.
అయోధ్యలో శాంతి సౌభ్రాతృత్వాలు వెల్లివిరుస్తున్నాయని చెప్పేందుకు తన గెలుపు ఓ గొప్ప ఉదాహరణ అని స్పష్టం చేశాడు. ఎన్నికల ప్రచారంలో తాను ఎలాంటి వివక్ష ఎదుర్కోనలేదని, ఓటర్లు అందరూ తనను ఆదరించి, అండగా నిలిచారని అన్సారీ తెలిపాడు.