climate change | వాతావరణ మార్పులతో భారత్లోని తొమ్మిది రాష్ట్రాలు ప్రమాదం పొంచి ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా 50 అత్యంత ప్రమాదక రాష్ట్రాల నగరాలను గుర్తించారు. ఇందులో భారత్ నుంచి బిహార్, యూపీ, పంజాబ్తో పాటు పలు రాష్ట్రాలున్నాయి. ఇటీవల పాక్లో వరదలు సృష్టించిన విధ్వంసాన్ని ‘గ్రాస్ డొమెస్టిక్ క్లైమేట్ రిస్క్’ నివేదిక ఉదాహరణగా పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 600 రాష్ట్రాలు, ప్రావిన్సులను కవర్ చేస్తూ 2050 సంవత్సరం వరకు ప్రపంచవ్యాప్తంగా జరిగే వాతావరణ మార్పులతో ప్రభావితమయ్యే నగరాల జాబితాను రూపొందించారు.
తీవ్రమైన వాతావరణ పరిస్థితుల వల్ల మానవ కార్యకలాపాలు, భవనాలతో పాటు మానవ నిర్మిత పర్యావరణానికి కలిగే నష్టాన్ని నివేదిక అంచనా వేసింది. వరదలు, అడవుల్లో మంటలు, వేడిగాలులు, సముద్రమట్టం పెరగడం వంటి విపరీతమైన వాతావరణ మార్పులతో ప్రమాదం పొంచి ఉందని నివేదిక పేర్కొంది. రిపోర్ట్ ప్రకారం.. 2050 నాటికి అత్యంత ప్రమాదంలో ఉన్న టాప్ 50 రాష్ట్రాలు, ప్రావిన్సుల్లో 80శాతం చైనా, అమెరికా, భారత్లోనే ఉన్నాయి. భారత్ నుంచి టాప్-50 జాబితాలో భారత్కు చెందిన రాష్ట్రాల్లో బీహార్ (22వ స్థానంలో ఉంది. ఉత్తరప్రదేశ్ (25), అసోం (28), రాజస్థాన్ (32), తమిళనాడు (36), మహారాష్ట్ర (38), గుజరాత్ (48), పంజాబ్ (50), కేరళ (52) ఉన్నాయి. అలాగే ఈ జాబితాలో మధ్యప్రదేశ్ 52, బెంగాల్ 60, హర్యానా 62, కర్ణాటక 65, తమిళనాడు 86, జమ్మూ కశ్మీర్ 104, హిమాచల్ప్రదేశ్ 155, ఢిల్లీ 213, ఉత్తరాఖండ్ 257 స్థానాల్లో ఉన్నాయి. ఇక పొరుగు దేశంలో పాక్లో 30శాతం వరద ముంపునకు గురయ్యే అవకాశం ఉంది.
ఇటీవల సంభవించిన వరదలకు సింధ్లోనే 9లక్షల ఇండ్లు ధ్వంసమయ్యాయి. పంజాబ్, సింధ్, ఖైబర్ఫంక్తువా రాష్ట్రాలు టాప్-100లో ఉన్నాయి. ఇక చైనాలో జియాంగ్షు, షాన్డాంగ్, హెబీ, గ్వాంగ్డాంగ్, హెనాన్, జెజియాంగ్, అన్హుయి, హునాన్, షాంఘై, లియానింగ్, జియాంగ్జి, హుబీ, టియాంజిన్, హీలాంగ్జియాంగ్, సిచువాన్, గ్వాంగ్జి రాష్ట్రాలుండగా.. అమెరికాలో ఫ్లోరిడా, కాలిఫోర్నియా, టెక్సాస్ రాష్ట్రాలు వాతావరణ మార్పుల కారణంగా ప్రభావితం కానున్నాయి. ఐరోపాలో ఉన్నతస్థాయి రాష్ట్రాలు లండన్, మిలన్, మ్యూనిచ్, వెనిస్ నగరాలు సైతం ఈ జాబితాలో ఉన్నాయి. అయితే, వాతావరణ మార్పుల కారణంగా ప్రభావితమయ్యే నగరాల జాబితాను విడుదల చేయడం ఇదే తొలిసారి.