Jio AirFiber : ప్రముఖ టెలికాం దిగ్గజం జియో ఎయిర్ ఫైబర్ (Air fiber) వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. 60 రోజులపాటు ట్రిపుల్ ఇంటర్నెట్ స్పీడ్ను ఉచితంగా ఆఫర్ చేస్తున్నది. అంటే ప్రస్తుత ప్లాన్ కంటే మూడింతల అధిక వేగంతో డేటాను అందివ్వనుంది. కొత్త యూజర్లతోపాటు ఇప్పటికే ఎయిర్ఫైబర్ వినియోగిస్తున్న వారికీ ఈ ఆఫర్ వర్తిస్తుంది. త్వరలో ఐపీఎల్ సీజన్ ఫీవర్ ప్రారంభం కాబోతున్న వేళ జియో ఈ ఆఫర్ ప్రకటించడం గమనార్హం.
జియో ఎయిర్ ఫైబర్ ప్లస్ యూజర్ల కోసం ధన్ ధనా ధన్ ఆఫర్ పేరిట ఈ స్పీడ్ బూస్టర్ను టెలికాం సంస్థ అందిస్తోంది. మార్చి 16 నుంచి ఈ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. తాజా ఆఫర్తో బేస్ప్లాన్ 30 ఎంబీపీఎస్ వినియోగిస్తున్న వారికి 100 ఎంబీపీఎస్ వేగం లభిస్తుంది. 100 ఎంబీపీఎస్ ప్లాన్ వాడుతుంటే 300 ఎంబీపీఎస్, 300 ఎంబీపీఎస్ ప్లాన్పై 500 ఎంబీపీఎస్, 500 ఎంబీపీఎస్ ప్లాన్పై 1 జీబీ స్పీడ్తో డేటా సేవలు అందుతాయి.
కొత్త యూజర్లకు రీచార్జి చేసిన వెంటనే ఈ ప్లాన్ ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అవుతుంది. పాత యూజర్లకు స్పీడ్ అప్గ్రేడ్ గురించి ఆ మేరకు ఈ-మెయిల్, ఎస్సెమ్మెస్ వస్తుంది. అయితే ఎవరైతే 6 నెలలు లేదా 12 నెలల జియో ఎయిర్ఫైబర్ సబ్స్క్రిప్షన్ తీసుకుని ఉంటారో వారికే ఈ ఆఫర్ వర్తిస్తుంది. సాధారణ జియో ఫైబర్ యూజర్లకు ఈ ఆఫర్ వర్తించదు. కాగా, ఐపీఎల్ 2024 జియో సినిమాలో ప్రసారం కానున్నది. 4K రిజల్యూషన్లో మ్యాచ్లను వీక్షించే వీలుంది. ఒకవేళ డేటా సరిపోకపోతే రీచార్జి చేసుకునేందుకు వీలుగా రూ.101, రూ.251 డేటా యాడ్-ఆన్ ప్లాన్లను కూడా జియో తీసుకొచ్చింది.