- 16 మీడియా సంస్థలపై 160కోట్ల పరువు నష్టం దావా
విధాత : రాడిసన్ బ్లూ హోటల్ డ్రగ్స కేసులో తనపై తప్పుడు కథనాలతో దుష్ప్రచారం చేశారంటూ బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ బామ్మర్ధి రాజేంద్రప్రసాద్ పాకాల సోమవారం పలు మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు పంపించారు. రాడిసన్ బ్లూ హోటల్లో జరిగిన డ్రగ్స్ కేసులో తప్పుడు వార్తలు ప్రసారం చేశారంటూ 16 మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు పంపారు.
ఒక్కో మీడియా సంస్థ పైన 10 కోట్ల దావా కింద.. మొత్తంగా 160 కోట్లకు దావా వేశారు రాడిసన్ బ్లూ హోటల్లో జరిగిన డ్రగ్స్ దందాలో సూత్రధారి రాజేంద్రప్రసాద్ పాకాల అని పలు మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయని, తన మీద అనవసర వార్తలు రాశారని మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు పంపించారు.
నోటీసులు అందుకున్న వారం రోజుల్లోగా తన పరువుకు భంగం కలిగించేలా పోస్ట్ చేసిన వార్తలు, వీడియోలు డిలీట్ చేయాలని నోటీసుల్లో తెలిపారు. వెంటనే తనకు క్షమాపణలు చెప్పాలని లేకపోతే తనపై వచ్చిన తప్పుడు కథనాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బీఆరెస్పై దుష్ప్రచారం ఆపని పక్షంలో యూ ట్యూబ్ చానళ్లపై కేసులు వేస్తామని కేటీఆర్ ప్రకటించిన వెంటనే ఆయన బామ్మర్థి నోటీస్లు జారీ చేయడం గమనార్హం.