KTR | పూలే స్ఫూర్తితోనే బీఆరెస్ పథకాలు: కేటీఆర్‌

  • Publish Date - April 11, 2024 / 02:38 PM IST

విధాత : సమాజంలోని అణగారిన వర్గాల అభున్నతికి మహాత్మ జ్యోతిరావు పూలే చేసిన కృషి స్ఫూర్తితోనే మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వం దళిత బందు, రైతుబంధు, గురుకుల పాఠశాలలు వంటి పథకాలను అమలు చేసిందని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పేర్కోన్నారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతి ఉత్సవాలలో ఆయన నివాళులర్పించి మాట్లాడారు.సమాజం కోసం పని చేసి శాశ్వతమైన ఖ్యాతిని సాధించుకున్న గొప్ప మహా మనిషి జ్యోతిబాపూలే అని కేటీఆర్ కొనియాడారు.

197 సంవత్సరాల క్రితం జన్మించిన పూలే ఎంచుకున్న మార్గం ఆయన బోధనలు ఇప్పటికీ కూడా అందరికీ ఆచరణీయమన్నారు. విద్యతోనే అనే వికాసం వస్తుందని బలమైన నమ్మకంతో తన ఇంటి నుంచే మార్పు మొదలుపెట్టి ముందుకు సాగిన గొప్ప వ్యక్తి అని, తన సతీమణి సావిత్రిబాయికి పాఠాలు చెప్పి ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్ది ఇద్దరు కలిసి దేశం మొత్తానికి ఆదర్శంగా నిలిచారని స్మరించారు.

సమాజంలోని అన్ని వర్గాలు జ్యోతిబాపూలే వారసత్వాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరముందని, ఏ కులం ఏ మతంలో పుట్టాలి అన్న విషయం మన చేతిలో లేదని, అవకాశాల కల్పన, ఉపాధి కల్పన అందరికీ సమాన హక్కులు ఇవ్వాల్సిన బాధ్యత ఇచ్చే అవకాశం సమాజానికి ప్రభుత్వానికి ఉన్నదని గుర్తు చేశారు. ఈ విషయంలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వానికి వివిధ రకాల సలహాలు, సూచనలు ఇస్తూ బాధ్యతను నిర్వహిస్తామన్నారు.

పూలే బాటలోనే బీఆరెస్ పథకాలు

75 సంవత్సరాల భారత స్వాతంత్ర చరిత్రలో మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపించిన ప్రభుత్వం గత పది సంవత్సరాల మా బీఆరెస్‌ ప్రభుత్వమని గర్వంగా చెప్పగలుగుతామని కేటీఆర్ తెలిపారు. విద్యతోనే వికాసం, వికాసం తోనే సమానత్వం అన్న పూలే ఆలోచనలో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా 1000కి పైగా గురుకుల పాఠశాలలను పెట్టి విద్యను అందించామని వెల్లడించారు.

ఒక్కో విద్యార్థి పైన 1,25,000 ఖర్చుతో అంతర్జాతీయ స్థాయి విద్య అందించామని, మహాత్మా జ్యోతిబాపూలే చెప్పిన స్ఫూర్తి తోనే ఈ కార్యక్రమం కొనసాగిందని గుర్తు చేశారు. ప్రతి పాఠశాలను ఇంటర్మీడియట్ కాలేజీకి అగ్రీడ్ చేశామని, బీసీ విద్యార్థుల కోసం 33 డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీలు పెట్టామని, మహాత్మ జ్యోతిబాపూలే పేరుతో 20 లక్షల రూపాయల ఓవర్సీస్ ఫెలోషిప్ ను అందించామని వివరించారు.

ఈ విషయంలో దళిత గిరిజన బహుజన అగ్రవర్ణ పేదలు అన్న వివక్ష చూడలేదని, టాటాలు, బిర్లాలు ముఖ్యమే కాదు తాతలనాటి కుల వృత్తులు కూడా అంతే ముఖ్యమని ఆచరణాత్మకంగా వాటికి ఒక కొత్త రూపుని గౌరవాన్ని అందించామని, దేశమంతా స్కిల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నప్పుడు శతాబ్దాలుగా అందుబాటులో ఉన్న బహుజన వర్గాల నైపుణ్యం గురించి మాట్లాడిన వ్యక్తి మాజీ సీఎం కేసీఆర్ అని, అగ్గిపెట్టెలో పట్టిన చీర వేసే నేతన్న నైపుణ్యాన్ని తిరిగి గుర్తించారన్నారు.

బడుగు బలహీన వర్గాలకు ఉన్న అద్భుతమైన నైపుణ్యాన్ని కాపాడి వాటికి భద్రత ఇచ్చి అనేక కార్యక్రమాలను బడుగు బలహీన వర్గాల కోసం మా ప్రభుత్వం చేపట్టిందన్నారు. యాదవులు, ముదిరాజులు తమ వృత్తి నైపుణ్యం ద్వారా దేశంలోనే రాష్ట్రాన్ని తమ రంగాల్లో అగ్రగామిగా నిలిపారని, అదేవిధంగా ఒకప్పుడు ఊపిరి తీసుకునే నేతన్నలు ఈరోజు ఊపిరి పీల్చుకునే విధంగా తయారు చేశామని, గౌడ అన్నలకు కూడా అనేక మద్దతు అందించామన్నారు.

రాజకీయంగా కష్టమైన ఆ పథకాలు తెచ్చాం

మోస్ట్ బ్యాక్ వర్డ్‌ క్లాస్ వర్గాల కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశామని, దళిత బంధు, బీసీ బందు పెట్టినప్పుడు సమాజంలో ఇతర వర్గాల నుంచి కొంత ఇబ్బంది అవుతుందని హెచ్చరించినప్పటికి రాజకీయంగా రిస్క్ తీసుకొని బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడిన దమ్మున్న నాయకుడు కేసీఆర్ అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

కేసీఆర్‌ అనేక కార్యక్రమాలు చేపట్టి మహాత్మ పూలే బాటలో నడిచినారని, మేము విద్యా ఉపాధి రాజకీయ రంగాల్లో ఆచరణ ద్వారా మహాత్మ పూలే ఆలోచనలను ముందుకు తీసుకుపోయామని, అసెంబ్లీలో అత్యధికంగా బడుగు బలహీన వర్గాలకు సీట్లు ఇచ్చిన ఏకైక పార్టీ బీఆరెస్ అని, ప్రస్తుతం పార్లమెంట్ నియోజకవర్గ స్థానాల్లోనూ ఐదు రిజర్వేషన్ సీట్లు పోతే 12 సీట్లలో 50% సీట్లు కేటాయించిన పార్టీ బీఆరెస్ పార్టీయేనని వెల్లడించారు.

సామాజిక న్యాయం కైవలం మాటల్లోనే కాకుండా చేతల్లో చూపించిన పార్టీ బీఆరెస్ అని, కేవలం ప్రభుత్వాధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల కోసమే కాకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయ అవకాశాల కోసం కూడా పాటుపడుతున్న పార్టీ మాది అని కేటీఆర్ చెప్పారు.

కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలి

ఎన్నికల ముందు బీసీలను ఓటు బ్యాంకుగా చూసి వారి నుంచి ఓట్లు దండుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బిసి డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని కేటీఆర్‌ డిమాండ్ చేశారు. మహాత్మ పూలే పేరుతో 20 వేల కోట్ల రూపాయల బీసీ సబ్ ప్లాన్ పెడతామన్నారని, మొన్న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో ఒక్క రూపాయి కేటాయించలేదని, రానున్న బడ్జెట్ లో 20 వేల కోట్ల రూపాయలు బీసీలకు కేటాయించాలని, ఎంబీసీలకు ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామన్న హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.

బీసీలకు అంతర్జాతీయ స్థాయి గురుకులాలు పెడతామన్నారని, మండలానికి ఒకటి వెంటనే ప్రారంభించాలని, రాబోయే మూడు సంవత్సరాలలో ద్విశతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని మహాత్మ జ్యోతిబాపూలే సమున్నత విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. మా నాయకురాలు ఎమ్మెల్సీ కవిత అసెంబ్లీలో జ్యోతిబాపూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారని, బీసీల విషయంలో కేవలం మాటలకే పరిమితం కాకుండా మీరు ఇచ్చిన హామీలని ఆచరణ లోకి రావాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నట్లుగా చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా రంజాన్ పండుగను జరుపుకుంటున్న ప్రతి ఒక్క ముస్లిం సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు చెబుతున్నానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ స్పీకర్ ఎస్‌.మధుసూదనాచారి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యలు హాజరై పూలేకు నివాళులర్పించి ఆయన సేవలను స్మరించారు.

Latest News