Site icon vidhaatha

మేడారం మహాజాతరకు అంకురార్పణ


విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మేడారం మహాజాతరకు అంకురార్పణ జరిగింది. బుధవారం మండమెలిగే పండుగ ప్రారంభంతో ఈ తంతు ప్రారంభమైంది. ‘మండ మెలిగే’ పండుతో వనదేవతల మహాజాతర ప్రారంభమైనట్లుగా పూజారులు భావిస్తారు. జాతరకు సరిగ్గా వారం ముందు ప్రారంభమైన ఈ మండమెలిగే పండుగ కార్యక్రమంలో భాగంగా జాతర ఉత్సవాల్లో ప్రధాన పూజారి (వడ్డె) నేతృత్వంలోని బృందం మేడారంలోని సమ్మక్క గుడి వద్దకు చేరుకున్నారు. వన దేవతలకు వస్త్రాలు సమర్పించారు.


సారలమ్మ పూజారులు పూజలో పాల్గొన్నారు. ముగ్గులు వేసి శక్తిపీఠాన్ని అందగా అలంకరించారు. ఆదివాసీ సంప్రదాయం ప్రకారం పూజలు రాత్రి కూడా జరిగాయి. గురువారం మేకపోతును బలిచ్చి వన దేవతలకు నైవేద్యంగా సమర్పిస్తారు. సారలమ్మ తల్లి నివాసమైన కన్నెపల్లిలో, గోవిందరాజు కొలువై ఉండే కొండాయిలో, పగిడిద్దరాజు నివాసం పూనుగొండ్లలో కూడా ఇవే తరహా పూజా కార్యక్రమాలను స్థానిక పూజారులు నిర్వహిస్తారు.


మండ మెలిగె ప్రక్రియలో పూజలు


ఆదివాసీల ఆరాధ్య దైవాలైన వనదేవతల పూజా స్థలాలు నిరాడంబరమైనవిగా చెప్పాలి. మేడారంలో సమ్మక్క, కన్నెపల్లిలో సారలమ్మల గుళ్లు గతంలో గుడిసెలుగానే ఉండేవి. జాతరకు ముందు ఈ గుడిసెలను కొత్త గడ్డితో కప్పడం ఆనవాయితీ. దీన్నే గుడిమెలిగే కార్యక్రమంగా వ్యవహరిస్తారు. ఈ ప్రక్రియతో జాతర తొలి పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. అయితే ప్రస్తుతం గుడెసెలు లేకున్నా జాతరకు రెండు వారాల ముందు ‘గుడి మెలిగె’ ప్రక్రియను నిర్వహిస్తున్నారు.


జాతరకు సరిగ్గా వారం ముందు దేవతలు ఉండే ఆవరణలను శుద్ధి చేసి ముగ్గులు వేసి శోభాయమానంగా అలంకరించారు. దీన్నే ‘మండ మెలిగె’ కార్యక్రమంగా చెబుతారు. గుడి మెలిగె, మండ మెలిగె కార్యక్రమాలు తల్లుల వారంగా భావించే బుధవారాల్లో మాత్రమే నిర్వహిస్తారు. ‘మండ మెలిగె’ తర్వాత మరుసటి రోజున గురువారం మేకను వన దేవతలకు బలి ఇచ్చి పూజారులు (వడ్డె), గ్రామపెద్దలు పండుగ నిర్వహిస్తారు. ఇదే రోజును సమ్మక్క వారంగా భావించి భక్తులు తమ ఇళ్లను శుద్ధి చేసుకుని వనదేవతలకు పూజలు చేయడం సంప్రదాయంగా వస్తోంది.

Exit mobile version