Site icon vidhaatha

Minister KTR | క్యాన్స‌ర్ స్క్రీనింగ్ శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా క్యాన్సర్ శిబిరాన్ని( Cancer Screening Center ) రాష్ట్ర మున్సిపల్ అండ్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR ) ప్రారంభించారు. బుధవారం జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ప్రతిమ ఫౌండేషన్ ద్వారా నిర్వహించిన ఈ మెగా శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవం ((Women’s day)) సందర్బంగా మహిళల కోసం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రణాళిక బోర్డు చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ స్వగ్రామమైన ఏనుగల్లులో ఏర్పాటు చేశారు.

ఆరోగ్యం పై మహిళలు శ్రద్ధ వహించాలి

మహిళలు ఇంటి పనులు, కుటుంబ బాధ్యతలలో నిమగ్నమై ఆరోగ్యం పై అశ్రద్ధ వహించకూడదని రాష్ట్రమంత్రి కేటీఆర్ సూచించారు. క్యాన్సర్ పరీక్షా శిబిరాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశంలో మహిళలను క్యాన్సర్ ఒక అదృశ్య శక్తిగా పీడిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా గ్రామీణ మహిళలకు క్యాన్సర్ పట్ల అవగాహన లేక, జబ్బు తీవ్రత పెరిగిన తర్వాత వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారని వివరించారు.

ఈ సమస్య నుంచి గట్టెక్కిచ్చేందుకు ఇలాంటి మెగా శిబిరాలు ఉపయోగపడతాయని అన్నారు. శిబిరాన్ని నిర్వహించిన ప్రతిమ ఫౌండేషన్ నిర్వాహకులను మంత్రి అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేకంగా మహిళలకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ పరీక్షలను వినియోగించుకోవాలని కేటీఆర్ కోరారు.

భారీగా తరలివచ్చిన మహిళలు

మెగా క్యాన్సర్ శిబిరానికి పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. వీరికి ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. దీర్ఘకాలిక చికిత్స అవసరమైన వారిని హాస్పిటల్స్ కు రెఫర్ చేశారు.

కేటీఆర్‌కు ఘన స్వాగతం

మంత్రి కేటీఆర్ జిల్లా పర్యటన సందర్భంగా ఆయనకు ఘ‌న స్వాగతం పలికేందుకు మంత్రుల నుంచి చిన్న స్థాయి నాయకుని వరకు పోటీపడ్డారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ( Minister Errabelli Dayaker Rao ), ఎంపీ పసునూరి దయాకర్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ , ప్రభుత్వ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, గండ్ర జ్యోతి, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, చల్లా ధర్మా రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, నన్నపునేని నరేందర్, జిల్లా కలెక్టర్ గోపి, పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Exit mobile version