Site icon vidhaatha

ధరణి దరఖాస్తుల పరిష్కారం కోసం మార్చి 1 నుంచి 7 వరకు సదస్సులు


విధాత‌: ఇరిగేషన్, ఆర్థిక, విద్యుత్తు శాఖలపై విడుదల చేసినట్టుగానే త్వరలో ధరణిపై కూడా శ్వేతపత్రం విడుదల చేయబోతున్నామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఉస్మానియా యూనివర్సిటీ సోషియాలజీ విభాగం సోమవారం ఉస్మానియా యూనివర్సిటీలో ‘తెలంగాణ పునర్నిర్మాణం’పై నిర్వహించిన సెమినార్‌కు మంత్రి పొంగులేటి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంతో గొప్పగా చెబుతున్న ధరణి పోర్టల్‌లో రైతులు, రైతు కూలీలకు ఉన్న ఐదు గుంటలు, పది గుంటలు భూమి కూడా సమస్యలోకి నెట్టేశారని ఆరోపించారు.


ఆలోచనారహితంగా ధరణిని తీసుకొచ్చారని విమర్శించారు. ప్రభుత్వ భూములను తమ సొంత భూములుగా మార్చుకోవడానికి గత పాలకులు కుట్రపూరితంగా ధరణిని ప్రవేశపెట్టారని అన్నారు. ధరణికి సంబంధించి గత ప్రభుత్వ పెద్దలు ఎన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేశారో, ఎన్ని లక్షల కోట్ల ప్రజల సొత్తును కొల్లగొట్టారో త్వరలో ప్రజలముందు పెట్టబోతున్నామని మంత్రి వెల్లడించారు. భూరికార్డులకు శరాఘాతంగా పరిణమించిన ధరణి పోర్టల్‌ను పూర్తిగా ప్రక్షాళన చేయబోతున్నామని తెలిపారు.


ధరణిలో 2.45 లక్షల దరఖాస్తులు పెండింగ్‌


రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూశాఖ, ధరణికి సంబంధించి గత ప్రభుత్వంలో వచ్చిన 2.45 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని మంత్రి పొంగులేటి వెల్లడించారు. వీటి పరిష్కారానికి మార్చి 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు ఎమార్వో స్థాయిలో సదస్సులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.


ఏపీలో పార్టీకి నష్టం అని తెలిసీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌


రాష్ట్రాన్ని విభజిస్తే, ఏపీలో రాజకీయంగా తీవ్ర నష్టం జరుగుతుందని తెలిసి కూడా ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నాన్ని సోనియాగాంధీ నెరవేర్చారని పొంగులేటి చెప్పారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటించారని గుర్తు చేశారు. ఏ ఉద్దేశంతో, ఏ లక్ష్యంతో సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారో గత తొమ్మిదిన్నర సంవత్సరాల్లో అవి నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అరవై ఏళ్ళ ఆకాంక్షలకు భిన్నంగా వ్యహరించారని, గత పదేళ్ళలో తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని, తెలంగాణ అస్తిత్వాన్ని మంట కలిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


నీళ్లు, నిధులు, నియామకాల్లో తీరని నష్టం


నీళ్ళు, నిధులు, నియామకాల విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో కంటే కేసీఆర్‌ పాలనలోనే తెలంగాణకు తీరని నష్టం జరిగిందని మంత్రి పొంగులేటి ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా నియామకాల్లో అశ్రద్ధ వహించారని, నిరుద్యోగ కుటుంబాలతో చెలగాటం ఆడారని విమర్శించారు. నిరుద్యోగ యువతి ప్రవళిక ఆత్మహత్య చేసుకుంటే, ఒక క్యాబినెట్ మంత్రి అవహేళనగా మాట్లాడారని గుర్తు చేశారు. అప్పటి ప్రభుత్వ విధానాలతో, కొందరి స్వార్థంకోసం జరిగిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలతో నిరుద్యోగ కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.


ఏడాదిలో 2 లక్షల కొలువుల భర్తీ


ఏడాదిలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను, భర్తీ చేస్తామని, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ఇప్పటికే 23వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, మార్చి 2వ తేదీన వివిధ విభాగాలకు సంబంధించి ఆరువేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నామని ప్రకటించారు. త్వరలో మెగా డీఎస్సీని కూడా ప్రకటించబోతున్నామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేశామని చెప్పారు. అనుభవం, నిజాయతీ గల అధికారులను నియమించామని తెలిపారు.


అద్భుతం కూలిపోతున్నది..


నీళ్ళ విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు మంచి జరిగేలా గత ప్రభుత్వ పెద్దలు నిర్ణయాలు తీసుకున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. 80 వేల పుస్తకాలు చదివానని, తానే ఇంజినీర్‌ను, తానే తాపీ మేస్త్రిని, తానే డిజైనర్‌ను అంటూ ప్రపంచ అద్భుతం కాళేశ్వరం ప్రాజెక్టును వేగంగా నిర్మించానని ప్రచారం చేసుకున్న ఆ పెద్దమనిషి ఇప్పుడు కాళేశ్వరం పరిస్థితి ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. లక్ష కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ప్రపంచ అద్భుతం నేడు కుప్పకూలిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.


గత ప్రభుత్వ అవినీతికి కాళేశ్వరం ఒక నిదర్శనమని మంత్రి వ్యాఖ్యానించారు. ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రారంభించిన జలయజ్ఞంలో భాగంగా గోదావరి, కృష్ణా నదులమీద చేపట్టిన ప్రాజెక్టులను ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం రీ-డిజైన్ పేరుతో దోచుకుని ధనిక రాష్ట్రాన్ని, ఏడు లక్షల కోట్ల అప్పులోకి నెట్టిందని మంత్రి పొంగులేటి విమర్శించారు. ప్రతి తెలంగాణ బిడ్డపైన అప్పుల భారాన్ని మోపిన ప్రబుద్ధులు గత ప్రభుత్వ పెద్దలని దుయ్యబట్టారు.


ఒక్కొక్కటీ సరి చేస్తున్నాం


గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలను ఒక్కొక్కటి సరిచేసుకుంటూ, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దాలను అమలు చేస్తున్నామని పొంగులేటి చెప్పారు. అధికారంలో వచ్చిన రెండు రోజుల్లోనే, రెండు గ్యారంటీలను అమలు చేశామని, ఈ నెల 27న మరో రెండు గ్యారంటీలను అమలు చేస్తున్నామని ప్రకటించారు.


విద్య, వైద్యానికి ప్రాధాన్యం


గత ప్రభుత్వంలో నిర్లక్ష్యాన్ని గురైన విద్య, వైద్య రంగాలకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని పొంగులేటి తెలిపారు. యూనివర్సిటీలలో ఖాళీలను సైతం భర్తీ చేస్తామని, ఉస్మానియా వర్సిటీ సమస్యలను త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళతానని, అధికారులతో సమావేశం ఏర్పాటు చేయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.


తొమ్మిదిన్నరేళ్లలో ఊహించనంత విధ్వంసం


గత తొమ్మిదిన్నర సంవత్సరాల్లో తెలంగాణ ఊహించని రీతిలో విధ్వంసానికి గురి అయిందని ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. అధికారాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో చెప్పడానికి ఇటీవలి కాగ్ రిపోర్టు నిదర్శనమన్నారు. పదేండ్లపాటు అధికారాన్ని బీఆరెస్‌ పెద్దలు తమ స్వప్రయోజనాలకు వాడుకున్నారని విమర్శించారు.


ముప్పై ఏళ్ళ తర్వాత ఆర్ట్స్ కాలేజీ కి అధికార హోదాలో క్యాబినెట్ మంత్రి


30 ఏళ్లక్రితం క్రితం క్యాబినెట్ మంత్రి హోదాలో సమాచార శాఖ మంత్రిగా డీ శ్రీనివాస్ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీకి వెళ్ళారు. అప్పట్లో యూనివర్సిటీ అధికారులు ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఏ మంత్రి కూడా యూనివర్సిటీకి వెళ్ళలేదు. వెళ్ళే సాహసం కూడా చేయలేదు. గతంలో రాష్ట్రపతి హోదాలో ప్రణబ్ ముఖర్జీ వచ్చిన సందర్భంలో ఆయనతో పాటు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఇప్పుడు ముప్పై ఏళ్ళ తర్వాత క్యాబినెట్ మంత్రి హోదాలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉస్మానియా వర్సిటీలో అడుగు పెట్టారు.

Exit mobile version