విధాత, హైదరాబాద్ : బీఆరెస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం పేరిట గృహకల్పలో లీజుకు తీసుకున్న భవనాన్ని స్వప్రయోజనాలకు వాడుకున్న వ్యవహారంపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఈ వ్యవహారంలో శ్రీనివాస్గౌడ్పై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైంది. ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందిగా హౌసింగ్ బోర్డు అధికారులను రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు. టీజీవో వ్యవస్థాపక చైర్మన్ హోదాలో సంఘం కార్యాలయం కోసం శ్రీనివా్సగౌడ్ 2013లో హౌసింగ్ బోర్డు నుంచి మూడు అంతస్తులను లీజుకు తీసుకున్నారు. అయితే అందులో ఒక అంతస్తును తెలంగాణ ఎడ్యుకేషనల్ ట్రస్టు పేరుతో శ్రీనివాస్గౌడ్ స్వప్రయోజనాల కోసం వాడుకున్నారనే విషయాన్ని ఇటీవల నూతనంగా ఏర్పడిన టీజీవో కార్యవర్గం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. దీంతో స్టడీ సర్కిల్ పేరుతో ట్రస్టు ఏర్పాటు చేసినట్లు, కార్పొరేట్ తరహాలో క్యాబిన్లు ఏర్పాటు చేసినట్లు, అందులో ప్రైవేటు చానల్ను నిర్వహించినట్లు హౌసింగ్ బోర్డు గుర్తించింది. నిబంధనల్ని ఉల్లంఘించినందున లీజు ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ హౌసింగ్ బోర్డు అధికారులు శ్రీనివాస్గౌడ్కు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం భవనంలోని మూడు అంతస్తులూ నూతనంగా ఏర్పడిన టీజీవో అధీనంలో ఉండటంతో వారికి కూడా నోటీసులు జారీ చేశారు. అయితే పాత కార్యవర్గం హయాంలో జరిగిన లీజు ఉల్లంఘనలతో తమకు సంబంధం లేదని టీజీవో ప్రస్తుత అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు హౌసింగ్ బోర్డుకు సమాధానమిచ్చారు.
ఒప్పంద రద్దును ప్రశ్నిస్తూ మాజీ మంత్రి నోటీస్లు
మరోవైపు 33 ఏళ్లకుగాను కుదుర్చుకున్న లీజు ఒప్పందాన్ని ఎలా రద్దు చేస్తారని ప్రశ్నిస్తూ శ్రీనివాస్గౌడ్ తిరిగి హౌసింగ్ బోర్డుకు నోటీసులు పంపారు. పైగా అధికారులపై ఆయన ఒత్తిడి చేయడంతో శ్రీనివా్సగౌడ్ తమను బెదిరిస్తున్నారంటూ వారు మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ అంశంపై విచారణ చేయాలని, శీనివాస్గౌడ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గృహనిర్మాణ శాఖ కార్యదర్శిని ఆదేశించారు. ఇదిలా ఉండగా నూతనంగా ఏర్పడిన టీజీవో అవసరాల కోసం రెండు అంతస్తులను కేటాయించేందుకు యోచనలో హౌసింగ్ బోర్డు ఉందని, ఈ మేరకు హౌసింగ్ బోర్డుకు, టీజీవోకు మధ్య చర్చలు జరుగుతున్నాయని సమాచారం.
చదరపు అడుగుకు రూ.1 అద్దెతో.. 33 ఏళ్లకు లీజు
టీజీవో కోసం హౌసింగ్ బోర్డు ఇంజనీరింగ్ అధికారులు నాంపల్లి గృహకల్ప భవనం బ్లాక్-2లోని 1వ, 2వ, 3వ అంతస్తులను 2013లో లీజుకు ఇచ్చారు. ఒక్కో అంతస్తులో 2,960 చదరపు అడుగుల లెక్కన 8,880 చదరపు అడుగుల విస్తీర్ణాన్ని 33 ఏళ్లకు లీజుకు ఇస్తూ ఒప్పందం చేసుకున్నారు. 2013 జూన్ 25 నుంచి 2046 జూన్ 24 వరకు.. చదరపు అడుగుకు నెలకు రూ.1 చొప్పున అద్దె చెల్లించేలా, ఏటా ఈ అద్దెను 10 శాతం పెంచేలా ఒప్పందం చేసుకున్నారు. అయితే శ్రీనివాస్గౌడ్ భవనంలోని మూడో అంతస్తులో తెలంగాణ ఎడ్యుకేషనల్ ట్రస్టు ఏర్పాటు చేశారు. గ్రూప్ పరీక్షలకు శిక్షణ ఇస్తామని, మహిళల స్వయం ఉపాధికి బాటలు వేస్తామని ట్రస్టు ద్వారా ప్రచారం చేసుకున్నారు. కానీ అక్కడ ఐబీఎన్ పేరుతో ఓ ప్రైవేటు చానల్ కార్యాలయం నిర్వహించారు. ఆ తరువాత అది పేరు మారి పలువురి చేతులు మారింది.