విధాత: మధ్యప్రదేశ్లోని దామోహ్ జిల్లాలో ఓ యువకుడు ఇంట్లోకి చొరబడి బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. అవమానం తట్టుకోలేక బాధిత బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం మారింది. దామోహ్ పోలీస్ స్టేషన్ మహిళా ఇన్ఛార్జ్ గరిమా మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి బాలిక తల్లిదండ్రులు ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్లారు. ఇంట్లో బాలిక ఒంటరిగా ఉన్నదని గ్రహించిన అదే గ్రామానికి చెందిన యువకుడు ఇంట్లోకి చొరబడి ఆమెపై లైంగికదాడి చేశాడు. ఘటన అనంతరం బాలిక ఇంట్లో ఉంచిన పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది.
బాలిక పరిస్థితిని చుట్టుపక్కల వారు గమనించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. బాధితురాలి కుటుంబ సభ్యులు బాలికను దమోహ్ జిల్లా దవాఖానకు తీసుకెళ్లారు. బాలిక తనపై అత్యాచారం జరిగిందని దవాఖానలో పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. వైద్య పరీక్షల్లో బాలికపై లైంగికదాడి జరిగినట్టు వైద్యులు నిర్ధారించిన రిపోర్టు ఆధారంగా పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నది.