Site icon vidhaatha

మహిళా దినోత్సవం రోజున ధర్నా చేయాల్సిరావడం సిగ్గుచేటు


విధాత : ఉద్యోగ రిజర్వేషన్ల సమస్యపై అంతర్జాతీయ మహిళా దినోత్సం రోజు ధర్నా చేయాల్సి రావడం సిగ్గుచేటని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ఉద్యోగాల్లో మహిళా రిజర్వేషన్లకు నష్టదాయకంగా మారిన జీవో 3ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఇందిరపార్క్ ధర్నా చౌక్ వద్ధ ఎమ్మెల్యే కవిత ఒకరోజు నిరసన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ మహిళా దినోత్సవ వేడుకల రోజున ఆడ‌బిడ్డల ఉద్యోగాల‌కై ధ‌ర్నాలు చేసే దౌర్భాగ్యపు స్థితిని ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకొచ్చిందని విమర్శించారు. బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ మహిళలకు అనేక హక్కులు కల్పించారని చెప్పారు.


తెలంగాణ వచ్చిన తర్వాత 33 శాతం రిజర్వేన్‌ను పెంచుకున్నామన్నారు. ఆడబిడ్డలకు అన్యాయం జరిగే ఏ ఒక్క కార్యక్రమం బీఆరెస్‌ చేయలేదని వెల్లడించారు. అదే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆడపిల్లలకు వ్యతిరేకంగా జీవో 3 తెచ్చిందని విమర్శించారు. ఈ జీవో వల్ల ఉద్యోగాల్లో అమ్మాయిలకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వం వెంటనే ఈ జీవోను రద్దుచేసి, హైకోర్టులు పిటిషన్‌ వేయాలని డిమాండ్‌ చేశారు.


కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళా వ్యతిరేక విధానాలతో ముందుకువెళ్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజలకు వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకున్నా నిలదీస్తామని స్పష్టం చేశారు. జీవో 3 వల్ల గురుకులాల్లో మహిళలకు 12 శాతం ఉద్యోగాలే వచ్చాయన్నారు. తనకే అన్ని చట్టాలు తెలుసున్నట్టు సీఎం రేవంత్‌ వ్యవహరిస్తారని చెప్పారు. మహిళలకు 33 శాతం ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాజీవ్‌ గాంధీ విగ్రహం పెడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు లక్షకుపైగా ఉద్యోగాలు కల్పించుకున్నామని చెప్పారు.


కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల విషయంలో మాట తప్పిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వ్యక్తిగతంగా చనిపోయిన ఆడబిడ్డలను అడ్డుపెట్టుకుని రేవంత్‌ రెడ్డి రాజకీయం చేశాడని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో దొరికిన వ్యక్తి మహిళల ఉద్యోగాల విషయంలో కోత విధించారన్నారు. వికలాంగులు, మహిళలకు తోడు ఉండకుండా ఎవరికి తోడు ఉంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

Exit mobile version