Site icon vidhaatha

కులగణన తీర్మానం కంటితుడుపు చర్య: ఎమ్మెల్సీ కవిత

విధాత : తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ చేసిన కులగణన తీర్మానం కేవలం కంటితుడుపు చర్య అని బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. శనివారం ఉదయం బంజారాహిల్స్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కవిత మాట్లాడారు. బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. కులగణనకు చట్టబద్ధత కల్పించాలని, తక్షణమే ఆ చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించాలని ఆమె డిమాండ్‌ చేశారు. బీసీ సబ్ ప్లాన్‌కు కూడా చట్టబద్ధత కల్పించాలన్నారు. తీర్మానంలో ప్రభుత్వం కులగణన ఎప్పటిలోగా పూర్తి చేస్తారో, ఎలా చేస్తారో చెప్పలేదన్నారు.


స్పష్టత లేని కులగణన తీర్మానం బీసీలను మభ్యపెట్టే చర్య అని విమర్శించారు. తలాతోక లేని తీర్మానాన్ని తీవ్రంగా నిరసిస్తున్నామని చెప్పారు. బీహార్, కర్ణాటక రాష్ట్రాల్లో కులగణన చేపట్టే ముందు చట్టం చేశారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీది బీసీ వ్యతిరేక చరిత్ర అని ఆరోపించారు. మండల్ కమిషన్ సమయంలో పార్లమెంటులో రాజీవ్ గాంధీ బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడారని గుర్తుచేశారు. 2011లో యూపీఏ హయాంలో చేసిన కులగణన నివేదికను ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు బీసీలు ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చారో రాహుల్ గాంధీ చెప్పాలన్నారు.

Exit mobile version