విధాత: బొమ్మలరామారంలో అమర జవాన్ లెఫ్టినెంట్ కల్నల్ వినయ్ భాను రెడ్డి కుటుంబసభ్యుల్ని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkat Reddy) పరామర్శించారు. దేశ రక్షణ కోసం విధి నిర్వహణలో ఉండగా హెలికాప్టర్ ప్రమాదంలో లెఫ్టినెంట్ కల్నల్ ఉప్పల వినయ్ భాను రెడ్డి మృతి చెందడం బాధాకరమన్నారు. ఆయన మృతి నల్గొండ జిల్లాకే కాదు.. దేశానికే పెద్ద లోటని కోమటిరెడ్డి అన్నారు.
యువ కల్నల్ను కోల్పోయామని, ఆయన చనిపోయినప్పుడు ప్రతీ ఒక్కరూ కంటనీరు పెట్టారన్నారు. వీవీబీ రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని, ఆయన దేశం కోసం చనిపోయారని, వీరసైనికుడ్ని మనం కోల్పోవడం తీరని లోటు అన్నారు.
కల్నల్ వీవీబీ రెడ్డి, స్పందన రెడ్డి దంపతులిద్దరూ భారత ఆర్మీలో దేశ సేవకు అంకితం కావడం గ్రామానికి, జిల్లాకు గర్వకారణమని, ఆయన పేరు అందరికీ గుర్తుండిపోయేలా బొమ్మలరామారంలో పార్టీలకు అతీతంగా విగ్రహం ఏర్పాటు చేయిస్తానన్నారు.
రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్ర ప్రభుత్వం కల్నల్ కుటుంబానికి అండగా నిలిచి ఆదుకోవాలని, సూర్యాపేటలో కల్నల్ సంతోష్ కు కాంస్య విగ్రహం ఎలా ఏర్పాటు చేశారో.. భువనగిరిలో వీవీబీ రెడ్డి కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.
హైదరాబాద్లో 500 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని, దీనిపై ముఖ్యమంత్రిని కలవడమా? లేఖ రాయడమా? అనేది ఆలోచిస్తున్నానని, వినయ్ భానురెడ్డి స్ఫూర్తి అందరికీ గుర్తుండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన భార్యకు గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వాలని కోరారు.