- ముస్సావిర్ హుస్సెన్ షాజిబ్గా ఎన్ఐఏ ప్రకటన
విధాత: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గుర్తించింది. నిందితుడు కర్ణాటకలోని తీర్ధహళ్లి జిల్లా శివమొగ్గకు చెందిన ముస్సావిర్ హుస్సెన్ షాజిబ్గా ఎన్ఐఏ వెల్లడించింది. నిందితుడు ఈ ఏడాది జనవరిలో చెన్నైలో నివసించినట్లు కూడా గుర్తించారు. నిందితుడు ధరించిన టోపీ ఆధారంగా అతడిని గుర్తించినట్లుగా ప్రకటించింది. కేసు దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ పేలుడు జరిగిన కేఫ్ పరిసరాల్లోని 1,000 కంటే ఎక్కువ సీసీటీవీ కెమెరాలను పరిశీలించిందని, నిందితుడు ధరించిన టోపీని వివిధ సీసీటీవీ వీడియోల్లో గుర్తించి విచారణ సాగించగా, ఈ టోపీని చెన్నై మాల్ నుంచి కొనుగోలు చేశాడని, నిందితుడు నెల రోజులకు పైగా చెన్నైలో నివాసం ఉన్నాడని ఎన్ఐఏ తెలిపింది.
షాజిబ్ సహచరులలో ఒకరిని కూడా తీర్ధహళ్లికి చెందిన అబ్దుల్ మతిన్ తాహాగా యాంటి టెర్రర్ ఎజెన్సీ నిర్ధారించిందని, తమిళనాడు పోలీసు ఇన్స్పెక్టర్ కె. విల్సన్ హత్య కేసులో తాహాకు సంబంధం ఉందని, ప్రధాన నిందితుడితో పాటు అతడు చెన్నైలో ఉన్నాడని ఎన్ఐఏ వెల్లడించింది. తాహా కూడా శివమొగ్గలోని ఐఎస్ఐఎస్ మాడ్యూల్లో భాగమని ఎస్బీఐ వర్గాలు తెలిపాయి. గతంలో అరెస్టయిన మాడ్యూల్ సభ్యులు కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారని, పేలుడుకు ఒకరోజు ముందు కేఫ్లో రెక్కి నిర్వహించిన సీసీటీవీ ఫుటేజీలో తాహా కూడా కనిపించాడని పేర్కోంది. మార్చి 1న బెంగళూరులోని రామేశ్వర్ కేఫ్లో టైమర్తో పేల్చిన ఐఈడీ బాంబు పేలుడులో పది మంది గాయపడ్డారు. ఈ కేసులో నిందితుడి ఆచూకీ చెప్పిన వారికి 10లక్షల రివార్డు ప్రకటించారు.
టోపీ ఆధారంతో దొరికిన నిందితుడి ఆచూకీ
కేఫ్లో పేలుడుకు పాల్పడిన నిందితుడి ఆచూకీని అతడు ధరించిన టోపీ ఆధారంగా గుర్తించడం ఈ కేసులో ఆసక్తికరణ అంశం. షాజిబ్ వెంట ఉండే తాహా ఎప్పుడు ట్రిప్లికేన్లో కొనుగోలు చేసిన టోపీని ధరించేవాడని ఎన్ఐఏ కథనం. పేలుడు జరిగిన రోజున నిందితుడు షాజిబ్ అదే క్యాప్ ధరించాడు. ఈ టోపీ పరిమిత ఎడిషన్ సిరీస్ అని, 400 క్యాపులు మాత్రమే అమ్ముడయ్యాయని యాంటీ-టెర్రర్ ఏజెన్సీ కనుగొంది. సీసీటీవీ ఫుటేజీలో, చెన్నె మాల్ నుంచి తాహా టోపీ కొనుగోలు చేస్తున్నట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. పేలుడు తరువాత షాజిబ్ వెళ్లిపోతూ కేఫ్ నుంచి కొంత దూరంలో టోపీని పడేశాడు.
విచారణలో టోపీ జనవరి చివరిలో మాల్ నుంచి కొనుగోలు చేసినట్లు తేలింది. తమకు దొరికిన టోపీలో వెంట్రుకలు కనిపించడంతో, వాటిని ఫోరెన్సిక్కు పంపగా, ప్రధాన అనుమానితుడు షాజిబ్ తల్లిదండ్రుల డీఎన్ఏ నమూనాలతో సరిపోలినట్లు నివేదిక నిర్ధారించింది. ఆ తర్వాత షాజిబ్ తల్లిదండ్రులు తమ కుమారుడిని సీసీటీవీ ఫుటేజీలో చూసి, కనిపించిన వ్యక్తి తమ కుమారుడేనని నిర్ధారించారు. షాజిబ్ చెన్నై నుంచి వచ్చి బెంగళూరు కేఫ్లో పేలుడు పదార్ధం పెట్టాడా అనే కోణంలో ఇప్పుడు ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. అనుమానితుడు చివరిసారిగా ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులో కనిపించాడని ఎన్ఐఏ వెల్లడించింది.