విధాత: విశాఖ గర్జన రోజే పవన్ కళ్యాణ్ విశాఖలో ప్రోగ్రాం ఏర్పాటు చేయడం అనాలోచితమో, కావాలని చేశారో తెలియదు కానీ మొత్తానికి విశాఖ అయితే వచ్చారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు అత్యుత్సాహం చూపారు. విశాఖ ఎయిర్పోర్ట్ వద్ద జనసేన కార్యకర్తలు వీరంగం సృష్టించారు. మంత్రులు రోజా, జోగి రమేశ్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కార్లపై దాడికి తెగబడ్డారు.
విశాఖ గర్జనకు మంత్రులు ఆర్కే రోజా, విడదల రజనీ, ధర్మాన , మేరుగ నాగార్జున, కొడాలి నాని, పేర్ని నాని తదితరులు హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం రోజా, జోగి రమేశ్, వైవీ సుబ్బారెడ్డి తిరుగుప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా వారు విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు.
అదే సమయానికి జనసేనాని పవన్కల్యాణ్ ఎయిర్పోర్ట్కు రావాల్సి వుంది. దీంతో పవన్కు స్వాగతం పలికేందుకు జనసేన కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు. ఎయిర్పోర్ట్ దగ్గర రోజా, జోగి రమేశ్, వైవీ సుబ్బారెడ్డి కార్లపై రాళ్లు, కర్రలతో జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. జనసేన కార్యకర్తలను చెదరగొట్టారు. వైసీపీ నేతలకు ఇబ్బంది లేకుండా అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ లోపలికి పంపారు.