Pawan Kalyan | సీనియర్ వేధింపుల కారణంగా ఆత్మహత్యకు యత్నించిన మెడికో విద్యార్థిని ప్రీతి ఆదివారం రాత్రి చికిత్స పొందుతూ నిమ్స్లో తుదిశ్వాస విడిచింది. ఐదు రోజులపాటు మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. మెడికో మృతితో నిమ్స్ వద్ద రాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుటుంబ సభ్యులతో పాటు విద్యార్థి సంఘాలు ప్రీతి మృతికి కారణమైన సైకో సైఫ్ను కఠినంగా శిక్షించాలని, అలాగే ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
పోలీసులు కుటుంబ సభ్యులను ఒప్పించి ప్రీతి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించి, భారీ బందోబస్తు మధ్య పోలీసులు స్వగ్రామం మొండ్రాయి గిర్నీ తండాకు తరలించారు. మెడికో మృతికి పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలిపారు. సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సైతం ప్రీతి మృతిపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు.
‘వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో చదువుతున్న పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రీతి మరణం అత్యంత బాధాకరం. మృత్యువుతో పోరాడి తుది శ్వాస విడిచిన డాక్టర్ ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నా. సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ వేధింపులు భరించలేక డాక్టర్ ప్రీతి బలవన్మరణానికి పాల్పడ్డ పరిస్థితులు, కన్నవారి మానసిక వేదన గురించి తెలుసుకొంటే హృదయం ద్రవించింది.
తమ బిడ్డను సైఫ్ వేధిస్తూ, కించపరుస్తూ ఉన్నాడని తల్లితండ్రులు ఫిర్యాదు చేసిన వెంటనే కాలేజీ బాధ్యులు సరైన రీతిలో స్పందించి ఉంటే ఇటువంటి దురదృష్టకర పరిస్థితి వచ్చేది కాదు. డాక్టర్ ప్రీతి ఆత్మహత్యకు కారకుడైన నిందితుడికి కఠిన శిక్షపడేలా చర్యల తీసుకోవాలి. కళాశాలలో ముఖ్యంగా మెడికల్, ఇంజినీరింగ్ కళాశాలలో ర్యాగింగ్, వేధింపులు అరికట్టడంపై ప్రభుత్వం కఠిన వైఖరి అవలంభించాలి. సీనియర్ విద్యార్థుల ఆలోచన ధోరణి మారాలి. కొత్తగా కాలేజీలోకి అడుగుపెట్టిన వారిని స్నేహపూర్వకంగా అక్కున చేర్చుకుని తమ కుటుంబ సభ్యుల్లా ఆదరించాలి. అందుకు భిన్నంగా వేధింపులకు పాల్పడడం, ఆధిపత్య ధోరణి చూపడం రాక్షసత్వం అవుతుందని గ్రహించాలి’ అన్నారు.
డాక్టర్ ప్రీతి మరణం అత్యంత బాధాకరం – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/MVkSMsjn34
— JanaSena Party (@JanaSenaParty) February 27, 2023