Site icon vidhaatha

థర్డీ ఇయర్స్‌ పృథ్వీకి షాక్‌.. భార్యకు ప్రతి నెలా రూ.8 లక్షలు భ‌ర‌ణం చెల్లించాల్సిందే

విధాత‌: తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడు పృథ్వీరాజ్‌ అంటే తెలియని వారుండరు. ‘థర్డీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ’ అనే డైలాగుతో పృథ్వీరాజ్‌ ప్రేక్షకుల మదిలో ఎప్పటికి చేరిగిపోని కమెడియన్‌గా ముద్ర వేసుకున్నారు. అయితే, తాజాగా విజయవాడ 14వ అదనపు జిల్లా కోర్టు (ఫ్యామిలీ కోర్టు) నటుడు పృథ్వీరాజ్ భార్య శ్రీలక్ష్మికి ప్రతి నెల రూ. 8 లక్షల భరణం చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేస్తూ, తీర్పును వెలువరించింది.

విజయవాడకు చెందిన శ్రీలక్ష్మికి పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన బాలిరెడ్డి పృథ్వీరాజ్‌‌ తో 1984లో వివాహం జరిగింది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. పృథ్వీరాజ్‌ తనను నిర్లక్ష్యం చేస్తూ మానసికంగా వేధిస్తున్నారని, సెక్షన్‌ 498ఎ గృహహింస చట్టం కింద శ్రీలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే తన భర్త నుంచి భరణం ఇప్పించాలని 2017 జనవరి 10న ఆమె విజయవాడ ఫ్యామిలీ కోర్టులో కేసు దాఖలు చేశారు.

తన భర్త పృథ్వీరాజ్‌ సినిమాలు, టీవీ సీరియళ్ల ద్వారా నెలకు రూ.30 లక్షలు సంపాదిస్తున్నారని, అందుకు సంబంధించిన ఆదాయ వివరాలను కోర్టుకు సమర్పించిన ఆమె.. తనకు నెల నెల రూ.10 లక్షల భరణం ఇప్పించాల్సిందిగా కోర్టును కోరారు.

కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి, పృథ్వీరాజ్‌ తన భార్యకు నెలకు రూ.8 లక్షలు ఇవ్వాలని ఆదేశించారు. ఆమె కేసు దాఖలు చేసినప్పటి నుంచి ఇవ్వాలని.. ప్రతి నెలా 10వ తేదీ నాటికి భరణం చెల్లించాలని విజయవాడ 14వ అదనపు జిల్లా ఫ్యామిలీ కోర్టు తీర్పునిచ్చింది.

Exit mobile version