విధాత: టీఎస్పీఎస్సీ (TSPSC) పేపర్ల లీకేజీ వ్యవహారాన్ని నిరసిస్తూ బీజేపీ, బీఎస్పీ, వైఎస్ఆర్ టీపీ పార్టీలు చేపట్టిన దీక్షలు, ఆందోళనతో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం అట్టుడికింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై విచారణ జరిపి 30 లక్షలు మంది నిరుద్యోగుల జీవితాలను కాపాడేందుకు పరీక్షలను రీ షెడ్యూల్ చేయాలని, టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఆర్ఎస్పీ ఆమరణదీక్ష
గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేయాలనే డిమాండ్తో లక్డికపూ్ల్లోని బీఎస్పీ కార్యారాలయంలో ఆమరణదీక్ష చేస్తున్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను పోలీసులు అరెస్టు చేసి ఆయన నివాసానికి తరలించారు. ఆయన ఇంట్లోనే దీక్ష కొనసాగిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఎన్ని అరెస్టులు చేసినా తమ పోరాటం ఆగదన్నారు. నిరుద్యోగులకు న్యాయం చేయాలని, గ్రూప్ 1 ప్రిలిమ్స్ను రద్దు చేయాలని, సర్వీస్ కమిషన్ ఛైర్మన్ను తొలిగించి లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు.
నేను శాంతియుతంగా నా దీక్షను స్వగృహంలోనే కొనసాగిస్తున్నా. దయచేసి తెలంగాణ ప్రజలకు ఈ ఉద్యమాన్ని శాంతియుతంగా కొనసాగించాలని కోరుకుంటున్నా.