RBI : సాధారణంగా ఆదివారం బ్యాంకుల సెలవు ఉంటుంది. ఆదివారం ఏదైనా బ్యాంకు పని పడితే సోమవారం వరకు వేచి ఉండక తప్పదు. కానీ ఈ ఆదివారం ఆ అవసరం లేదు. ఎందుకంటే ఈ ఆదివారం దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు తెరిచే ఉంటాయి. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే ఒక ప్రకటన చేసింది.
ఈ ఆదివారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) చివరి రోజు కావడంతో ప్రభుత్వ లావాదేవీలకు, ఇతరత్రా చెల్లింపులకు, ట్యాక్స్ పేయర్స్కు ఆటంకం లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదివారం సేవలు అందించాలని 33 బ్యాంకులకు ఉత్తర్వులు జారీ చేసింది.
దాంతో ఎస్బీఐ సహా 12 ప్రభుత్వరంగ బ్యాంకులు, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ సహా 20 ప్రైవేట్ రంగ బ్యాంకులు, అదేవిధంగా విదేశీ బ్యాంక్ అయిన డీబీఎస్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదివారం (మార్చి 31) యథావిధిగా పనిచేయనున్నాయి. నెఫ్ట్, ఆర్టీజీఎస్తోపాటు చెక్ క్లియరెన్సులు తదితర సేవలు కూడా యథాతథంగా కొనసాగుతాయి.