విధాత: ఢిల్లీ లిక్కర్ కేసు (Delhi Liquor Case) ను పక్కదారి పట్టించేందుకే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) దీక్ష చేపట్టారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు. ఐదేళ్లు ఎంపీగా ఉన్న కవిత మహిళా రిజర్వేషన్లపై (Women’s Reservation Bill) అప్పుడెందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు.
అవినీతి ఆరోపణలు వస్తే తన కొడుకైనా, కూతురైనా జైలుకు పంపిస్తానని సీఎం కేసీఆర్ (CM KCR) గతంలో చెప్పారన్నారు. మరి.. అవినీతి ఆరోపణలపై రాజయ్యను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన కేసీఆర్.. ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. ఈడీ(ED), సీబీఐ (CBI) రెండూ బీజేపీ జేబు సంస్థలని వ్యాఖ్యానించారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో ఏం జరుగుతుందో ఈడీ అధికారులు ఇప్పటి వరకు వివరణ ఇవ్వలేదన్నారు. ఈ అంశంపై కేసీఆర్ మౌనంగా ఉండటం బీజేపీ నేత బండి సంజయ్కి కనిపించడం లేదా? అని నిలదీశారు. బండి సంజయ్ , కిషన్ రెడ్డి కాగితం పులుల్లా టీవీల ముందు రంకెలేస్తున్నారని మండిపడ్డారు.
నేషనల్ హెరాల్డ్ కేసు (National Herald corruption case)లో సోనియా (Sonia Gandhi) పట్ల వ్యవహరించినట్లు.. లిక్కర్ కేసులో కవిత పట్ల ఎందుకు వ్యవహరించడంలేదని ప్రశ్నించారు. ఈ తతంగాన్నంతా ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారన్నారు.
బండీ.. కేసీఆర్పై చర్యలేవి: రేవంత్
కేసీఆర్ అవినీతిపై తాను ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎందుకు విచారణ చేపట్టలేదని బీజేపీ నేతలను రేవంత్ ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని ప్రధాని, కేంద్ర మంత్రులు చెప్పారని, అయినా కేసీఆర్ అవినీతిపై విచారణ చేపట్టక పోవడం వెనుక కుమ్మక్కు రాజకీయాలేంటని నిలదీశారు.
బండి సంజయ్ వ్యవహారం గురవిందగింజ చందంగా ఉందన్నారు. బండి సంజయ్ వచ్చే ఎన్నికల్లో కరీంనగర్ ఎమ్మెల్యేగా గంగుల కమలాకర్ పై పోటీ చేస్తారో లేదో చెప్పాలని ప్రశ్నించారు. గతంలో పోటీ చేసిన సంజయ్.. ఇప్పుడు అక్కడ పోటీ చేయకపోతే… బండి సంజయ్కి, బీఆర్ఎస్కు మధ్య చీకటి ఒప్పందం ఉన్నట్టు ప్రజలు గుర్తిస్తారని పేర్కొన్నారు.