Site icon vidhaatha

TSPSC | రేవంత్ రెడ్డికి సిట్‌ నోటీసులు! ఆధారాలు సిట్‌కు ఇవ్వను: రేవంత్‌ రెడ్డి

విధాత‌: టీఎస్‌పీఎస్సీ (TSPSC) పేపర్‌ లీకేజీ కేసులో సిట్ (SIT) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ లీకేజీ వ్యవహారంపై ఆరోపణలు చేస్తున్న వారందరికీ సిట్‌ నోటీసులు ఇస్తున్నది. తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సహా మరికొందరికి సిట్‌ అధికారులు నోటీసులు జారీ చేశారు. మల్యాల మండలంలో 100 మందికి పైగా గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో 100 పైగా మార్కులు వచ్చాయని రేవంత్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన దగ్గర ఉన్న వివరాలు అందజేయాలని రేవంత్‌కు ఇచ్చిన నోటీసుల్లో సిట్‌ పేర్కొన్నది.

సిట్‌ దర్యాప్తుపై మాకు నమ్మకం లేదంటూ.. రేవంత్ (Revanth), బండి సంజయ్ (Bandi Sanjay), ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్ (RS Praveen Kumar) తదితరులు సీబీఐ లేదా హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో దర్యాప్తు చేయించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు చేసిన దుర్మార్గపు పనికి వ్యవస్థకు ఆపాదిస్తారా? లీకేజీతో తనకు ఏం సంబంధమని మంత్రి కేటీఆర్ మొన్న ప్రెస్‌మీట్‌లోనే అన్నారు. ఆయన వ్యాఖ్యలను తప్పుపడుతూ.. వీళ్లంతా కేటీఆర్‌, కవితపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ సమయంలో సిట్‌ వాళ్ల దగ్గర ఉన్న ఆధారాలను ఇవ్వాలని నోటీసులు ఇస్తుండటం రాజకీయంగా కలకలం సృష్టిస్తున్నది.

ఆధారాలు లేకుండా తమపై ఆరోపణలు చేస్తే సహించేది లేదని గతంలో మంత్రి కేటీఆర్ (Minister KTR) విపక్ష నేతలను హెచ్చరించిన సంగతి తెలిసిందే. సర్వీస్‌ కమిషన్‌ అనేది రాజ్యాంగబద్ధమైన సంస్థ అని అందులో ప్రభుత్వ జోక్యం ఉండదని, ఈ విషయంలో నిరుద్యోగులను రెచ్చగొట్టడానికి తమపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు.

ఆరోపణలు చేస్తున్న నేతలకు సిట్‌ నోటీసులు ఇవ్వడంపై నేతలు ఎలా స్పందిస్తారు? ఈ వ్యవహారం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా కేటీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. వీటికి సంబంధించిన వివరాలు, ఆధారాలు ఇవ్వాలని సిట్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

సిట్‌ నోటీసులకు భయపడం.. సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిగిపిస్తే ఆధారాలు ఇస్తం: రేవంత్‌రెడ్డి

సిట్ నోటీసులు నాకు ఇంకా అందలేదని రేవంత్‌రెడ్డి తెలిపారు. అయినా తాను సిట్‌ నోటీసులకు భయపడేది లేదన్నారు. మా దగ్గర ఉన్న ఆదారాలను సిట్‌కు ఇవ్వమని తెలిపారు. TSPSC పేపర్‌ లీకేజీ వ్యవహాకరంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపించాలన్నారు. సిట్టింగ్‌ జడ్జి చేత విచారణ జరిగిపే అప్పుడు తమ వద్ద ఉన్న ఆధారాలను ఇస్తామని తెఇపారు.

30 లక్షల మంది నిరుద్యోగులకు కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందన్నారు. TSPSC పేపర్ లీకేజ్ బాగోతం బయటపడాలంటే సిట్టింగ్ జడ్జ్ తోనే విచారణ జరిపించాలన్నారు. కేసీఆర్, కేటీఆర్ గద్దె దిగేదాక తమ పోరాటం కొనసాగుతుందన్నారు. టీఎస్పీ ఎస్సీపేపర్‌ లీకేజీ కేసును కావాలనే నీరుగారుస్తున్నారని రేవంత్‌ రెడ్డి అన్నారు.

టీఎస్‌పీఎస్సీ (TSPSC) పేపర్ లీకేజ్ బాగోతం బయట పడాలంటే సిట్టింగ్ జడ్జ్‌తోనే విచారణ జరిపించాలని రేవంత్ డిమాండ్ చేశారు. కేసీఆర్, కేటీఆర్ గద్దె దిగేదాక మా పోరాటం కొనసాగుతుందని తెలిపారు. కేసును కావాలనే నీరు గారుస్తున్నారని రేవంత్ ఆరోపించారు.

పేపర్‌ లీకేజీపై విచారణ రేపటికి వాయిదా

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసుపై విచారణను వాయిదా వేయాలని పిటిషనర్‌ న్యాయవాది హైకోర్టును కోరారు. దీంతో విచారణ రేపటికి వాయిదా పడింది. లీకేజీపై ఎన్‌ఎస్‌యూఐ నేత బల్మూరి వెంకట్‌ హైకోర్టులో పిటిషన్‌ వేసిన విషయం విదితమే. కాంగ్రెస్‌ పార్టీ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు వాదనలు వినిపిస్తారని న్యాయవాది కోర్టుకు తెలిపారు. మరోవైపు ఈ కేసులో నిరుద్యోగులు కూడా హైకోర్టులో పిటిషన్‌ వేశారు.

Exit mobile version