SKLTSHU |
విధాత: ప్రపంచీకరణ నేపథ్యంలో మేధో సంపత్తి హక్కులకు చాలా ప్రాధాన్యం ఉన్నదని, భవిష్యత్తులో ప్రతి అంశంలోనూ వీటి ప్రమేయం ఉంటుందని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వ విద్యాలయం వైస్ చాన్స్ లర్ డాక్టర్ శ్రీమతి బీ నీరజ ప్రభాకర్ అన్నారు.
విశ్వవిద్యాలయ ప్రాంగణంలో తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఉద్యాన విశ్వవిద్యాలయం – మేధో సంపత్తి హక్కుల విభాగం సంయుక్తంగా ‘తెలంగాణ రాష్ట్రంలో ఉద్యాన పంటల వాణిజ్య పంథాలో మేధో సంపత్తి హక్కుల పాత్ర’ పై నిర్వహించిన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పరిశోధకులు, ప్రొఫెసర్లు మేధో సంపత్తి హక్కుల పరిరక్షణకు సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
భవిష్యత్తులో రైతులకు, పంటలకు లాభాలు తెచ్చి పెట్టేలా మేధో సంపత్తి హక్కుల ను మార్చుకోవాలని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో భౌగోళిక గుర్తింపుకు అర్హత ఉన్న పలు ఉద్యాన పంటలపై సర్వేలు, పరిశోధనలు నిర్వహిస్తున్నామని, గణాంకాలు సేకరిస్తున్నామని త్వరలోనే వాటికి భౌగోళిక గుర్తింపు రిజిస్ట్రేషన్ కోసం అప్లై చేస్తామని చెప్పారు.
విద్యార్థులు చేపట్టిన పరిశోధనలో మేధోసంపత్తి హక్కులు పరిరక్షించేందుకు అవకాశాలుంటే వెంటనే రిజిస్ట్రేషన్ చేసేందుకు సిద్ధం కావాలని సూచించారు. ప్రముఖ అడ్వకేట్, రిజల్యూట్ ఫర్ ఐపీ, లీగల్ హెడ్ సుభాజిత్ సాహా మాట్లాడుతూ, భౌగోళిక గుర్తింపు పొందిన ఉత్పత్తుల ద్వారా 20 నుంచి 30% అధిక ధరను రైతులు పొందుతున్నట్టు తెలిపారు.
కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ పేటెంట్ ఏజెంట్ డాక్టర్ రాధిక వంగాల, వర్సిటీ డీన్ ఆప్ హార్టికల్చర్ డాక్టర్ అడపా కిరణ్ కుమార్, పీజీ డీన్ డాక్టర్ ఎం రాజశేఖర్, వర్సిటీ మేధాసంపత్తి హక్కుల పరిరక్షణ విభాగం నోడల్ ఆఫీసర్ డాక్టర్ పిడిగం సైదయ్య, కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్లు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.