Site icon vidhaatha

Smart Watch Ban | విధుల్లో లోకో పైలట్లు స్మార్ట్‌ వాచ్‌ వినియోగించకుండా బ్యాన్‌ విధించిన రైల్వే..!

Smart Watch Ban | డ్యూటీ సమయంలో రైలు ఇంజిన్ డ్రైవర్లు స్మార్ట్‌ వాచ్‌లు వినియోగించవద్దని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. స్మార్ట్‌ వాచ్‌ను మొబైల్‌ మాదిరిగానే ఓ ఉద్యోగి ఉపయోగించిన పరిస్థితుల్లో తాజాగా అధికారులు ఈ ఉత్తర్వులు జారీ చేశారు. వాహనదారులకు మాదిరిగానే రైలు నడిపే డ్రైవర్లకు సైతం కొన్ని నిబంధనలుంటాయి.

రైలు ప్రయాణ సమయంలో ఇంజిన్‌ కేబిల్‌లో ఇద్దరు డ్రైవర్లు మాత్రమే అనుకుంటారు. అవసరమనుకుంటే మరొకరికి అనుమతిస్తుంటారు. ఇందులో ఎవరి డ్యూటీలు వారికే ఉంటాయి. క్యాబిన్‌లో ఎందరు ఉన్నా విధుల్లో ఉన్న సమయంలో ఫోన్‌ వాడకూడదు. తాజాగా రైలు ఇంజిన్‌ డ్రైవర్లకు కొత్తగా మరో రూల్‌ను తీసుకువచ్చారు.

ట్రైన్ రన్నింగ్ సిబ్బంది స్మార్ట్ వాచ్‌లు వినియోగించకుండా నిషేధం విధించారు. వాస్తవానికి సదరన్‌ జోన్‌లో ఓ లోకోమోటివ్‌ పైలట్‌ గంటకు 110 కిలోమీటర్ల వేగంతో రైలును నడిపిస్తూనే మరో వైపు స్మార్ట్‌ వాచ్‌ను ఆపరేట్‌ చేస్తుండడాన్ని అధికారులు గుర్తించారు. స్మార్ట్ వాచ్‌ను కొద్దిసేపు మాత్రమే చూసినా.. వాచ్‌ స్క్రీన్‌ మాత్రమే తరుచూ ఆన్‌ అవడం గమనించారు.

ఈ ఘటన మదురై డివిజన్‌లో జరిగింది. ఇటీవల ఒడిశా బాలాసోర్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 280 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. ఆ తర్వాత రైలు డ్రైవర్లు ప్రోటోకల్స్‌కు కట్టుబడి ఉండాలని రైల్వేబోర్డులు, డివిజన్లను రైల్వేశాఖ ఆదేశించింది.

ఈ పరిస్థితుల్లో సిబ్బందికి స్మార్ట్‌వాచ్‌ల వాడకాన్ని నిషేధిస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని రైల్వేశాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా రైల్వేల్లో లోకోపైలట్లకు మొబైల్‌ ఫోన్ల వినియోగం ఇప్పటికే నిషేధం ఉన్నప్పటికీ.. రన్నింగ్ సిబ్బంది స్మార్ట్ వాచ్‌లను విస్తృతంగా వినియోగిస్తున్నారు. కొందరు తమ ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు వినియోగిస్తున్నారు.

ఈ ఘటనపై ఓ అధికారి స్పందిస్తూ ఆకస్మిక తనిఖీ సమయంలో లోకో పైలట్‌ 110 కిలోమీటర్ల వేగంతో నడుపుతున్న సమయంలో స్మార్ట్‌ వాచ్‌ను వాడడం గుర్తించామన్నారు. తరుచూ స్క్రీన్‌ ఆన్‌ అవుతూ కనిపించిందని, ఇది ప్రమాదకరమైందని పేర్కొన్నారు.

స్మార్ట్‌వాచ్‌లు కొన్ని మొబైల్‌కు కనెక్ట్‌ చేసిన సమయంలో మొబైల్‌ మాదిరిగానే ఉపయోగించవచ్చని జోనల్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ బీ గుగణేశన్ పేర్కొన్నారు. స్మార్ట్‌ వాచ్‌లో ఫోన్‌ చేసే అవకాశం ఉందని, కాల్స్‌ను సైతం రిసీవ్‌ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇకపై రన్నింగ్ సిబ్బంది విధి నిర్వహణలో స్మార్ట్‌లు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హెచ్చరించారు.

Exit mobile version