మాజీ ప్రెస్‌ ఫొటోగ్రాఫర్‌ హత్య కేసులో ట్రయాంగిల్‌ లవ్‌.. దర్యాప్తులో దిగ్భ్రాంతికర విషయాలు

నాగపూర్‌లో పట్టపగలే ఇంట్లో హత్యకు గురైన మాజీ ప్రెస్ ఫొటోగ్రాఫర్‌ వినయ్‌ అలియాస్‌ బబ్లూ పూనేకర్‌ హత్య కేసులో యూపీ పోలీసులు రోజుల వ్యవధిలోనే పురోగతి సాధించారు

  • Publish Date - February 29, 2024 / 10:59 AM IST

నాగపూర్‌: నాగపూర్‌లో పట్టపగలే ఇంట్లో హత్యకు గురైన మాజీ ప్రెస్ ఫొటోగ్రాఫర్‌ వినయ్‌ అలియాస్‌ బబ్లూ పూనేకర్‌ హత్య కేసులో యూపీ పోలీసులు రోజుల వ్యవధిలోనే పురోగతి సాధించారు. ఈ కేసులో అతని ప్రియురాలు, ప్రధాన నిందితురాలు సాక్షి గ్రోవర్‌, ఆజంగఢ్‌కు చెందిన హేమంత్‌శుక్లాను అరెస్టు చేశారు. ఈ కేసులో బ్లాక్‌మెయిలింగ్‌ కోణంలో పరిశోధించిన పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దాని ఆధారంగా దర్యాప్తు కొనసాగించగా.. ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ బయటపడింది.


ఇంట్లోనే హత్య


ఫిబ్రవరి 24వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు నాగపూర్‌లోని రాజనగర్‌లో ఫొటోగ్రాఫర్‌ హత్యకు గురయ్యాడు. హత్య జరిగిన సమయంలో ఇంట్లో వినయ్‌ ఒక్కడే ఉన్నాడు. తుపాకితో వినయ్‌ను కాల్చి చంపిన అనంతరం నిందితుడు ఇంటి నుంచి బయటకు పరుగులు తీయడం సీసీటీవీలో రికార్డయింది.


ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ?


వినయ్‌, సాక్షిల మధ్య పదేళ్లుగా పరిచయం ఉన్నది. అయితే.. వివాహం తర్వాత సాక్షి కట్నిలోని తన అత్తవారింటికి వెళ్లిపోయింది. మూడేళ్ల క్రితం సాక్షి భర్త చనిపోయాడు. అనంతరం హేమంత్‌ శుక్లా అనే వ్యక్తితో సాక్షికి పరిచయం ఏర్పడింది. అతడు కట్నిలోని ఒక జిమ్‌లో ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు. వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఆరు నెలల క్రితం సాక్షి నాగపూర్‌లో నివసించేందుకు వచ్చింది.


సాక్షి ఈ-మెయిల్‌ ఖాతాను, సోషల్‌ మీడియా ఎక్కౌంట్లను యాక్సెస్‌ చేసిన హేమంత్‌.. ఆమె కదలికలపై కన్నేసి ఉంచాడు. సాక్షి, వినయ్‌ చాట్‌ చేసుకోవడాన్ని గమనించాడు. దీంతో వీరిద్దరి మధ్య లవ్‌ ఎఫైర్‌ నడుస్తున్నదనే అనుమానానికి వచ్చాడు. ఫిబ్రవరి 23న హేమంత్‌ నాగపూర్‌కు వచ్చాడు. వినయ్‌ను కన్వీన్స్‌ చేసి, వెళ్లిపోతానని సాక్షికి చెప్పాడు.


వినయ్‌ను కాంటాక్ట్‌ చేశాడు. శనివారం రెండుసార్లు మీటింగ్‌ కోసం టైమ్‌ పెట్టుకున్నారు. సాక్షి కూడా వినయ్‌ను శనివారం రెండుసార్లు కాంటాక్ట్‌ చేసింది. హేమంత్‌ను టక్డి పోలీస్‌ లైన్‌లోని రిలయెన్స్‌ పెట్రోల్‌ బంక్‌ వద్ద దించింది. అక్కడి నుంచి హేమంత్‌.. వినయ్‌ ఇంటికి నడుచుకుంటూ వెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. వినయ్‌ మెడ మీద హేమంత్‌ తుపాకి పెట్టి రెండుసార్లు కాల్చాడని దర్యాప్తులో వెల్లడైంది.


వినయ్‌ ఇంట్లోని ల్యాప్‌ట్యాప్‌లో అశ్లీల చిత్రాలు


వినయ్‌ ఇంట్లో పెద్ద సంఖ్యలో యాంటి-డిటాక్స్‌ ప్యాకెట్లు లభ్యమైనట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. వాటితోపాటు ల్యాప్‌టాప్‌, పెన్‌డ్రైవ్‌లలో అశ్లీల చిత్రాలు కూడా లభ్యమైనట్టు తెలిసింది. వినయ్‌కు చెందిన ఎలక్ట్రానిక్‌ డివైస్‌లలో బూతు వీడియోలు, ఫొటోలు ఉన్నట్టు తెలుస్తున్నది. హత్యకు ప్రధాన కారణంపై స్పష్టత రానప్పటికీ.. ట్రయాంగిల్‌ లవ్‌ లేదా బ్లాక్‌మెయిలింగ్‌ కోణాల్లో పోలీసులు అనుమానిస్తున్నారు.


నగ్న చిత్రాలు చూపించి బెదిరింపులు జరిగాయా? అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. వినయ్‌ను సాక్షి, హేమంత్‌ కుట్ర పన్ని హత్య చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే.. విచారణలో సాక్షి నోరు మెదపడం లేదని సమాచారం. ఏడాది క్రితం కూడా వినయ్‌కు వాట్సాప్‌ కాల్‌లో బెదిరింపులు వచ్చాయని సమాచారం. అప్పట్లో ఈ విషయమై సైబర్‌ పోలీస్‌ స్టేషన్‌లో వినయ్‌ ఫిర్యాదు కూడా చేశాడు.

Latest News