Site icon vidhaatha

Sajjanar | ఆర్టీసీకి ఎగవేస్తే చట్టపర చర్యలు తప్పవు

Sajjanar | విధాత : ఆర్టీసీ బస్సుల్లో ప్రకటనల ఒప్పందం మేరకు చెల్లించాల్సిన రూ.21.73 కోట్లను మోసం చేసిన కేసులో ‘గో రూరల్ ఇండియా’ సంస్థ నిర్వాహకుడు వి.సునీల్ అరెస్ట్ కాపాడాన్ని టీఎస్‌ ఆర్టీసీ యాజమాన్యం స్వాగతిస్తోందని, ఒప్పందాలను ఉల్లంఘించి బకాయిలను ఎగవేసే సంస్థలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎండీ వీ.సీ.సజ్జనార్‌ హెచ్చరించారు.


హైదరాబాద్, సికింద్రాబాద్ రీజియన్లలో తిరిగే మెట్రో ఎక్స్ ప్రెస్, మెట్రో డిలక్స్ బస్సుల్లో ప్రకటనల కోసం గో రూరల్ ఇండియా అనే యాడ్ ఏజెన్సీ 2015 సెప్టెంబర్ లో టీఎస్ఆర్టీసీతో ఒక ఒప్పందం కుదుర్చుకుందన్నారు. ఆరు సంవత్సరాలకు గాను 2021 సెప్టెంబర్ వరకు అగ్రిమెంట్ చేసుకుందని, ఆ ఒప్పందం ప్రకారం సకాలంలో లైసెన్స్ ఫీజును ఆ సంస్థ చెల్లించలేదన్నారు. హైదరాబాద్ రీజియన్ లో రూ.10.75 కోట్లు, సికింద్రాబాద్ రీజియన్ లో రూ.10.98 కోట్లు బకాయిలున్నాయన్నారు.


టీఎస్ఆర్టీసీ ఎండీగా తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత పెండింగ్ బకాయిలపై సమీక్ష జరిపామన్నారు. సకాలంలో లైసెన్స్ ఫీజు చెల్లించని సంస్థలపై నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ ఆదేశాల నేపథ్యంలో గో రూరల్ ఇండియా అనే యాడ్ ఏజెన్సీకి పలుమార్లు లీగల్ నోటీసులను సంస్థ జారీ చేసిందని, ఆ నోటీసులకు స్పందించిన యాడ్ ఏజెన్సీ.. రూ.55 లక్షలకు ఇచ్చిన చెక్ లకు ఇచ్చిందన్నారు. అవి చెల్లలేదని, ఈ మోసంపై అప్జల్ గంజ్, మారేడ్ పల్లి పోలీస్ స్టేషన్లలో వేర్వేరుగా టీఎస్ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారని తెలిపారు.


ఈ కేసు హైదరాబాద్ సెంట్రల్ క్రైం స్టేషన్ కు బదిలీ అయిందని, విచారణ చేపట్టిన దర్యాప్తు అధికారులు ‘గో రూరల్ ఇండియా’ సంస్థ నిర్వాహకుడు వి.సునీల్ ను శుక్రవారం అరెస్ట్ చేశారన్నారు. ఉద్దేశపూర్వకంగా లైసెన్స్ ఫీజులను ఎగవేసే సంస్థలపై నిబంధనల మేరకు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం చర్యలు తీసుకుంటుందన్నారు. బకాయిలు చెల్లించకుండా మోసాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం చర్యలుంటాయని స్పష్టం చేశారు.

Exit mobile version