Vande Bharat Express |
భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 25 మార్గాల్లో రైళ్లు పరుగులుపెడుతున్నాయి. పలుమార్గాల్లో నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు మంచి డిమాండ్ ఉన్నది.
టికెట్ ధరలు అధికంగా ఉన్నా వేగంగా గమ్యస్థానానికి చేరుకుంటుండడంతో ఎక్కువగా సెమీ హైస్పీడ్ రైళ్లలోనే ప్రయాణించేందుకు మొగ్గుచూపుతున్నారు. అయితే, ప్రస్తుతం రైళ్లు దాదాపు గంటకు 60 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తున్నాయి. అయితే, భవిష్యత్లో మరిన్ని రైళ్లు ప్రవేశపెట్టనుండగా.. ప్రయాణికులు వీటిలో ప్రయాణించేందుకు మొగ్గుచూపుతుండడంతో రైల్వే కీలక నిర్ణయం తీసుకుంటున్నది.
రెండు నగరాల మధ్య రైలు నడిచే సమయాన్ని మరింత తగ్గించేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తున్నది. ఇందు కోసం వందే భారత్ రైళ్లు ప్రస్తుతం నడుస్తున్న వేగం కంటే మరింత పెంచేందుకు యోచిస్తున్నది. ఇందులో భాగంగా చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో వందే భారత్ రైళ్లు తయారు చేస్తున్న విషయం తెలిసిందే.
సెమీ హైస్పీడ్ రైలు గరిష్ఠంగా గంటకు 200 నుంచి 220 కిలోమీటర్లకు పెంచే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇందు కోసం రైల్వేబోర్డు సైతం సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ రైళ్లు 220 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవాలంటే అందులో కీలక మార్పులు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వందేభారత్ రైళ్లకు స్టెయిన్లెస్ స్టీల్ లోహాన్ని వినియోగిస్తుండగా.. దాని ప్లేస్లో అల్యూమినియాన్ని వాడాల్సి ఉంటుంది.
అయితే, ఇందంతా జరగడానికి ప్రోటోటైప్ రైళ్లు సిద్ధం అయ్యేందుకు మరో రెండేళ్లు పట్టే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా చేస్తున్నారు. మొదట ప్రయోగాత్మకంగా పలు మార్గాల్లో నడుపనున్నారు. ఈ రైళ్లకు తగ్గట్లుగా సిగ్నలింగ్ వ్యవస్థలోనే సాంకేతిక మార్పులు జరుగనున్నాయి.
రాబోయే రోజుల్లో గంటకు 245 కిలోమీటర్ల వేగంతో రైళ్లు నడిచేలా ఈ వందేభారత్ రైళ్ల డిజైనింగ్లో మార్పులు చేయాలని రైల్వేశాఖ భావిస్తుంది. అయితే, పట్టాలపై గరిష్ఠ వేగంగా 220 కిలోమీటర్ల వరకు వెళ్లే అవకాశం ఉంటుందని రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి.