Vande Bharat Express | వందే భారత్ సరికొత్త రంగుల్లో కనిపించనున్నది. ఇందులో ఒకటి కాషాయరంగు కాగా.. మరొకటి బూడిదరంగులో కనిపించనున్నది. త్రివర్ణ స్ఫూర్తిగా తీసుకొని ఆయా రంగులను ఎంపిక చేసినట్లు రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇప్పటికే పలు రైళ్లకు కాషాయరంగులో సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది ఆగస్టు నాటికి దేశవ్యాప్తంగా 75 వందేభారత్ రైళ్లను నడపాలని భారతీయ రైల్వే భావించగా.. ప్రస్తుతం 25 మాత్రమే పట్టాలెక్కాయి. త్వరలోనే మరికొన్ని ప్రారంభించబోతున్నది. అయితే, కేవలం చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో మాత్రమే పనులు జరుగుతున్నాయి. పలు కంపెనీలకు సైతం ఆర్డర్లు ఇచ్చినా ఇంకా పనులు మొదలు పెట్టలేదని తెలస్తోంది. 2024 మార్చికి 77 రైళ్లు తయారుచేసి ఇచ్చేలా ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీకి రైల్వేశాఖ ఆర్డర్లు ఇచ్చింది. ఓ ప్రొటోటైప్ రైలు తయారయ్యేందుకు నెల రోజులు సమయం పడుతుంది.
ఇక వందేభారత్లో స్లీపర్ రైలు పనులు జనవరి నాటికి ప్రారంభించి ఫిబ్రవరి నాటికి కొత్త వర్షన్ను తీసుకురావాలని రైల్వేశాఖ లక్ష్యంగా పెట్టుకున్నది. 3ఏసీ, 2ఏసీ, ఫస్ట్ ఏసీ బోగిలుండేలా రైలును డిజైన్ చేస్తున్నారు. ఇదే సమయంలోనూ మెట్రో నమూనాను సైతం రూపొందించాలని రైల్వేశాఖ భావిస్తున్నది. మరో వైపు వందే భారత్ రైలులో కొత్తగా 25 మార్పు సైతం జరుగబోతున్నాయి. సీటు వాలును పెంచబోతుండడంతో పాటు ఫోన్ ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటు, మరుగుదొడ్లలో లైటింగ్, దివ్యాంగులకు వీల్ చైర్లను సైతం తీసుకురాబోతున్నారు. కేటగిరింగ్ విభాగం సైతంపై విమర్శలు, ఫిర్యాదులు వెల్లువెత్తుతుండడంతో దాంట్లోనూ మార్పులో చేయబోతున్నది.