విధాత: వైఎస్ జగన్తో భేటీ అనంతరం రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్స్ చేశారు. ఒకటి కాదు రెండు సినిమాలను చేస్తున్నట్లుగా వర్మ ప్రకటించారు. వరుస ట్వీట్స్తో పాటు ఓ వాయిస్ వీడియో కూడా ఆయన విడుదల చేశారు. అందులో ఏముందంటే..
‘‘నేను అతి త్వరలో “వ్యూహం” అనే రాజకీయ సినిమా తియ్యబోతున్నాను .. ఇది బయోపిక్ కాదు.. బయో పిక్ కన్నా లోతైన రియల్ పిక్. బయో పిక్లో అయినా అబద్దాలు ఉండొచ్చు కానీ, రియల్ పిక్లో నూటికి నూరు పాళ్ళు నిజాలే ఉంటాయి.
అహంకారానికి, ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుంచి ఉద్భవించిన “వ్యూహం” కథ, ఇది రాజకీయ కుట్రల విషంతో నిండి ఉంటుంది. రాచ కురుపు పైన వేసిన కారంతో బొబ్బలెక్కిన ఆగ్రహానికి ప్రతికాష్టే “వ్యూహం” చిత్రం.
ఈ చిత్రం 2 పార్ట్స్ గా రాబోతుంది .. మొదటి పార్ట్ “వ్యూహం” , 2nd పార్ట్ “శపథం”.. రెండింటిలోనూ రాజకీయ ఆరాచకీయాలు పుష్కలంగా వుంటాయి. రాష్ట్ర ప్రజలు మొదటి చిత్రం “వ్యూహం “ షాక్ నుంచి తెరుకునే లోపే వాళ్ళకి ఇంకో ఎలెక్ట్రిక్ షాక్ , పార్ట్ 2 “శపథం“లో తగులుతుంది.
“వ్యూహం “ చిత్ర నిర్మాత నాతో అంతకుముందు వంగవీటి సినిమా తీసిన దాసరి కిరణ్. ఎలక్షన్స్ టార్గెట్ గా ఈ చిత్రం తియ్యట్లేదని చెప్తే ఎవ్వరూ నమ్మరు కనక ఏం చెప్పాలో ,ఏం చెప్పకూడదో చెప్పాల్సిన అవసరం లేదని మీకు వేరే చెప్పక్కర్లేదు,కనక చెప్పట్లేదు.
ఇట్లు మీ భవదీయుడు.. రామ్ గోపాల్ వర్మ..’’ అని వర్మ తన తదుపరి కార్యాచరణను ప్రకటించారు.