విధాత: విశాఖలో శనివారం కెరటాలు పోటెత్తాయి. అవును బంగాళాఖాతంలో కెరటాలు ఉప్పొంగుతూ ఉంటాయి కానీ శనివారం జన కెరటాలు ఉరకలేశాయ్. విశాఖ పాలనా రాజధాని కావాలని, కర్నూలు, అమరావతి న్యాయ, శాసన రాజధానులు కావాలని డిమాండ్ చేస్తూ ఉత్తరాంధ్ర యువత, జేఏసీ నాయకులు నిర్వహించిన గర్జనకు వేలాదిగా జనం తరలి వచ్చారు.
ఓ వైపు వాన కురుస్తున్నా జనం ఎక్కడా వెనకడుగు వేయలేదు. శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాల నుంచి ఉదయం ఉంచే యువత తరలి వచ్చింది. జానపద కళా రూపాలు ప్రదర్శిస్తూ మూడు రాజధానులను కాంక్షిస్తూ ఘనంగా ర్యాలీ జరిగింది.
10 రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నా జనం వెనకడుగు వేయలేదు. ఓ వైపు ఈ జనాలను ప్రభుత్వమే తరలించిందని చంద్రబాబు, టిడిపి నేతలు విమర్శిస్తున్నా అదేమీ పట్టని ఉద్యమకారులు వానలో తడిసి ముద్దవుతూనే ర్యాలీలో పాల్గొన్నారు.
విద్యార్ధులు అధ్యాపకులు మేధావులు ప్రజా సంఘాలు కూడా గట్టి మద్దతుగా నిలిచారు. తొలిసారిగా విశాఖ గర్జించింది. మా జోలికొస్తే మేము చూస్తూ ఊరుకోమని చాటి చెప్పింది. భారీ వానలో సక్సెస్ అయిన విశాఖ గర్జన సాక్షిగా ఉత్తరాంధ్రా జనం చెప్పే మాట ఒక్కటే. ఇది అంతం కాదు ఆరంభం. అంటే విశాఖ రాజధాని కోసం ఎందాకైనా అన్న నినాదమే ఇపుడు ఉత్తరాంధ్రాకు తారకమంత్రం అయింది.