Site icon vidhaatha

వరంగల్: విద్యార్థి రక్షిత ఆత్మహత్యలో వెలుగు చూస్తున్న నిజాలు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన జయముఖి ఇంజనీరింగ్ కాలేజీలో ఈసీఈ మూడో సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థిని రక్షిత ఆత్మహత్య సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది. స్నేహితుడని నమ్మి ఫోటో దిగితే వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ సంఘటనతో మనస్థాపానికి గురైన రక్షిత ఆత్మహత్యకు పాల్పడింది.

విద్యార్థిని మృతి సంఘటనలో తాజాగా పలు అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. మట్టెవాడ పోలీసులు, భూపాల్ పల్లికి చెందిన రక్షిత తల్లిదండ్రులు పబ్బోజు రమ, శంకరాచారి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

హై స్కూల్ ఫ్రెండ్‌ని నమ్మితే…

రక్షితకు హై స్కూల్ విద్య నభ్యసించే కాలంలో స్నేహితులుగా ఉన్న అజ్మీర రాహుల్ మరో విద్యార్థి జస్వంత్ ఇటీవల మళ్ళీ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వారి స్నేహం మళ్లీ చిగురించింది. ఈ సందర్భంగా స్నేహితులు కలిసి దిగిన ఫోటోలు తాజాగా రాహుల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

మనస్థాపానికి గురైన రక్షిత

తన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసిండని తెలిసి రక్షిత స్నేహితుల ద్వారా తెలుసుకొని మనస్థాపానికి గురైంది. ఈ విషయమై తల్లిదండ్రులకు తాను తప్పు చేయలేదని వివరించింది. దీంతో తల్లిదండ్రులు సర్ది చెప్పారు. తదుపరి రక్షితను హాస్టల్లో చదువుకోమంటూ పంపించారు. హాస్టల్‌కి బయలుదేరిన రక్షిత అక్కడికి వెళ్లలేదు. దీంతో తాము ఆందోళనకు గురై పోలీసులకు తమ బిడ్డ మిస్సింగ్‌పై ఫిర్యాదు చేశామన్నారు.

హాస్టల్‌కి వెళ్లకుండా రక్షిత ఇండోర్ వెళ్లి ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. రైల్వే స్టేషన్‌కు వెళ్లి రైలు పట్టాల మీద నుంచి తమకు ఫోన్ చేసిందని, తాము నచ్చచెప్పి డబ్బులు పంపించి తిరిగి వచ్చే విధంగా చర్యలు తీసుకున్నామని వివరించారు. వచ్చిన తర్వాత సోమవారం పోలీస్ స్టేషన్‌కి వెళ్లి అన్ని వివరాలు చెప్పాలని భావించామని ఈ లోపు వరంగల్ రామన్నపేటలోని తన బాబాయి ఇంటి వద్ద ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు వివరించారు.

తన బిడ్డ ఫోటోలు అజ్మీరా రాహుల్, జశ్వంత్‌లు షేర్ చేయడాన్ని నామోషీగా భావించిందని తల్లిదండ్రులు తల్లడిల్లారు. ఇప్పటికే ఈ సంఘటనలో అజ్మీరా రాహుల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. భూపాల్ పల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కాలేజీకి సంబంధం లేదు

రక్షిత ఆత్మహత్య సంఘటనతో తమ కాలేజీకి ఎలాంటి సంబంధం లేదని జయముఖి కాలేజ్ యజమాన్యం స్పష్టం చేసింది. పబ్బోజు రక్షిత అనే విద్యార్థిని మా కళాశాలలోనే ఈసీఈ విభాగంలో అడ్మిషన్‌ పొందింది. రెండేళ్లు కళాశాలలోనే చదివింది. కానీ, బ్యాక్‌లాగ్‌లు ఉండడంతో మూడో సంవత్సరంలో డిటెండ్‌ అయింది. ఆరు నెలలుగా కళాశాలకు రావడం లేదు. కళాశాలకు రాని విద్యార్థినిని తమ కాలేజీలో ఎలా ర్యాగింగ్‌ చేస్తారు. సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం వైరల్‌ అవుతోందని కాలేజీ యాజమాన్యం ప్రకటనలో పేర్కొంది.

Exit mobile version