Maharastra Woman Doctor Suicide : ఎస్సై రేప్ చేశాడు.. అరచేతిలో సూసైడ్ నోట్ కలకలం

మహారాష్ట్ర సతారాలో ఎస్సై అత్యాచారానికి గురై వైద్యురాలు ఆత్మహత్య చేసుకుంది. అరచేతిలో సూసైడ్ నోట్ రాసి బలవన్మరణం పాలై రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.

Maharastra Woman Doctor Suicide

విధాత : మహారాష్ట్రలోని సతారా జిల్లాలో వైద్యురాలి ఆత్మహత్య సంచలనంగా మారింది. ఓ ఎస్సై తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ అరచేతిలో సూసైడ్ నోట్ రాసుకుని బలవన్మరణానికి పాల్పడింది. 5 నెల‌ల్లో ఆ పోలీసు స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ నాలుగు సార్లు అత్యాచారం చేసిన‌ట్లు ఆ నోట్‌లో పేర్కొన్న‌ది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీద్‌ జిల్లాకు చెందిన వైద్యురాలు సతారాలోని ఫల్టాన్‌ ప్రాంతంలో గల ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. గురువారం రాత్రి ఆమె ఫల్టాన్‌లోని ఓ హోటల్‌ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే మృతురాలి అరచేతిపై ఓ నోట్‌ రాసి ఉండటాన్ని గుర్తించారు.

సతారా పోలీసు విభాగానికి చెందిన ఇద్దరు పోలీసులు గత ఐదు నెలలుగా తనను వేధిస్తున్నారని మృతురాలు ఆ నోట్‌లో పేర్కొన్నారు. ఎస్సై గోపాల్‌ బదానే పలుమార్లు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని, మరో పోలీసు ప్రశాంత్‌ బంకర్‌ మానసికంగా వేధింపులకు గురిచేశాడని ఆమె ఆరోపించారు. దీంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్న ఆరోపణల ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.

తప్పుడు వైద్య నివేదికల కోసం వేధింపులు

వైద్యురాలి ఆత్మహత్య ఘటనపై ఆమె బంధువులు తీవ్ర ఆరోపణలు చేశారు. తప్పుడు వైద్య నివేదికలు ఇచ్చేలా బాధితురాలిపై ఉన్నతాధికారులు, పోలీసులు తీవ్రంగా ఒత్తిడి చేసేవారని ఆరోపించారు. నకిలీ పోస్ట్‌మార్టం రిపోర్టులు, రోగులు లేకపోయినా వారితో ఫిట్‌నెస్‌ రిపోర్టులు ఇచ్చేలా ఆమెపై ఒత్తిడి తెచ్చారన్నారు. దీనిపై ఇప్పటికే ఆమె ఎస్పీ, డీఎస్పీకి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఈ ఘటన రాష్ట్రంలో రాజకీయంగా దుమారం రేపింది. దీనిపై మహారాష్ట్ర మహిళా కమిషన్‌ చీఫ్‌ రూపాలీ స్పందించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ తక్షణమే ఆ ఇద్దరు పోలీసులను సస్పెండ్‌ చేయాలని సతారా ఎస్పీని ఆదేశించారు.