New Criminal Laws 2024: దేశవ్యాప్తంగా ఇవాళ్టి (జూలై 1) నుంచే మూడు కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి వచ్చాయి. ఈ మూడు చట్టాల అమలుతో భారతదేశ నేర న్యాయవ్యవస్థలో అనేక మార్పులు రానున్నాయి. కొత్తచట్టాల అమలుతో వలసవాద శకం నాటి మూడు పాత చట్టాలు ముగిశాయి. ఇవాళ్టి నుంచి ఇండియన్ పీనల్ కోడ్ (IPC), కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (CrPC), 1872 నాటి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో ఇండియన్ జస్టిస్ కోడ్, ఇండియన్ సివిల్ డిఫెన్స్ కోడ్ దేశంలో అమల్లోకి వచ్చాయి.
కొత్త చట్టాలు ఆధునిక న్యాయవ్యవస్థను నిర్ధా్ంచనున్నాయి. వీటిలో జీరో ఎఫ్ఐఆర్, ఎస్ఎంఎస్ వంటి ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా సమన్లు, పోలీసు ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేయడం, అలాగే అన్ని హేయమైన నేరాలకు నేర దృశ్యాలను తప్పనిసరిగా వీడియోగ్రఫీ చేయడం వంటి నిబంధనలు ఉన్నాయి. రాజ్యాంగంలో పొందుపరిచిన ఆదర్శాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత సామాజిక వాస్తవాలను సమర్థవంతంగా ఎదుర్కొనే యంత్రాంగాన్ని అందించే ప్రయత్నం జరిగిందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.
ఇవీ ప్రధాన మార్పులు
- విచారణ ముగిసిన 45 రోజులలోపు క్రిమినల్ కేసులో తీర్పును ప్రకటించాలి. మొదటి విచారణ జరిగిన 60 రోజుల్లోగా అభియోగాలు మోపేందుకు నిబంధన ఉంది. సాక్షుల భద్రత, సహకారాన్ని నిర్ధారించడానికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సాక్షుల రక్షణ పథకాలను అమలు చేయాలి.
- అత్యాచార బాధితుల వాంగ్మూలాలను బాధితురాలి సంరక్షకుడు లేదా బంధువు సమక్షంలో మహిళా పోలీసు అధికారి నమోదు చేస్తారు. ఏడు రోజుల్లో మెడికల్ రిపోర్టు పూర్తి చేయాలి.
- కొత్త చట్టాలు మహిళలు, పిల్లలపై నేరాలకు సంబంధించి కఠినమైన నిబంధనలను రూపొందించాయి. పిల్లలను కొనడం లేదా అమ్మడం చాలా ఘోరమైన నేరంగా పరిగణిస్తారు. దీనికి కఠినమైన శిక్ష విధిస్తారు. మైనర్పై సామూహిక అత్యాచారం చేస్తే మరణశిక్ష లేదా జీవిత ఖైదు విధించవచ్చు.
- పెళ్లికి సంబంధించిన తప్పుడు వాగ్దానాలతో మహిళలను విడిచిపెట్టిన కేసులకు ఇప్పుడు చట్టం శిక్షను విదిస్తుంది. 90 రోజులలోపు ఎప్పటికప్పుడు అప్డేట్లు అందుకోవడం, మహిళలపై నేరాలకు గురైన బాధితులకు ఉచితంగా ప్రథమ చికిత్స లేదా వైద్య చికిత్స అందించడం అవసరం. 14 రోజుల్లోగా ఎఫ్ఐఆర్, పోలీసు రిపోర్టు, ఛార్జ్ షీట్, స్టేట్మెంట్, ఒప్పుకోలు, ఇతర పత్రాల కాపీలను పొందే హక్కు నిందితులు, బాధితురాలు ఇద్దరికీ ఉంటుంది.
- ఇప్పుడు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా సంఘటనలను రిపోర్ట్ చేయవచ్చు. పోలీసు స్టేషన్కు వెళ్లవలసిన అవసరాన్ని ఇది తొలగిస్తుంది. జీరో ఎఫ్ఐఆర్ను ప్రవేశపెట్టడంతో ఒక వ్యక్తి తన అధికార పరిధితో సంబంధం లేకుండా ఏదైనా పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చు.
- అరెస్టయిన వ్యక్తి తన పరిస్థితి గురించి తనకు నచ్చిన వ్యక్తికి తెలియజేసే హక్కు కలిగి ఉంటాడు. తద్వారా అతను తక్షణ సహాయం పొందవచ్చు. అరెస్టు వివరాలు పోలీసు స్టేషన్లు, జిల్లా ప్రధాన కార్యాలయాలలో ప్రముఖంగా ప్రదర్శిస్తారు. దీనివలన ఆ విషయం సంబంధిత కుటుంబ సభ్యులు, స్నేహితులు సులభంగా తెలుసుకోగలుగుతారు.
- ఇప్పుడు తీవ్రమైన నేరాలకు సంబంధించి ఫోరెన్సిక్ నిపుణులు నేరస్థలాన్ని సందర్శించి ఆధారాలు సేకరించడం తప్పనిసరి. మహిళలపై కొన్ని నేరాలకు సంబంధించి, బాధితురాలి స్టేట్మెంట్ను వీలైనంత వరకు మహిళా మేజిస్ట్రేట్ నమోదు చేయాలి. అందుబాటులో లేకుంటే పురుష మేజిస్ట్రేట్ మహిళ సమక్షంలో వాంగ్మూలాన్ని నమోదు చేయాలి.
- అత్యాచారానికి సంబంధించిన స్టేట్మెంట్లను ఆడియో-వీడియో మాధ్యమం ద్వారా రికార్డ్ చేయాలి. తద్వారా పారదర్శకత ఉంటుంది. బాధితుడికి రక్షణ లభిస్తుంది.