New MP : లోక్సభ ఎన్నికల ఫలితాలు వెల్లడై వారం కూడా కాలేదు. ఈ ఎన్నికల్లో గెలిచిన ఎంపీలు ఇంకా ప్రమాణస్వీకారాలు కూడా చేయలేదు. కానీ అప్పుడే ఓ ఎంపీ బెదిరింపులు మొదలుపెట్టాడు. కోటి రూపాయలు ఇస్తావా..? లేదంటే నా చేతుల్లో చస్తావా..? అని ఓ వ్యాపారిని బెదిరించాడు. ఆ వ్యాపారి ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు ఎంపీపై కేసు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీహార్లోని పూర్ణియా లోక్సభ స్థానం నుంచి రాజేశ్ రంజన్ అలియాస్ పప్పుయాదవ్ విజయం సాధించారు. గతంలో ఆర్జేడీలో పనిచేసిన ఆయనకు ఈసారి ఏ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్గా పోటీచేసి గెలిచారు. అయితే ఎంపీగా విజయం సాధించి వారం కూడా తిరగకముందే పప్పూయాదవ్ బెదిరింపులకు తెరతీశారు.
పూర్ణియా నియోజకవర్గానికి చెందిన ఓ ఫర్నీచర్ వ్యాపారిని ఇంటికి పిలిపించుకుని కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించాడు. వచ్చే ఐదేళ్లు నియోజకవర్గంలో ప్రశాంతంగా బతకాలంటే తనకు కోటి రూపాయలు ఇవ్వాల్సిందేనని పప్పూ హుకుం జారీచేశాడు.
దాంతో బెదిరిపోయిన సదరు వ్యాపారి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పూర్ణియాలోని ముఫాసిల్ పోలీస్ స్టేషన్లో పప్పు యాదవ్పైన, ఆయన స్నేహితునిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్ణియా ఎంపీ తనను గతంలోనూ డబ్బుల కోసం బెదిరించాడని ఆ వ్యాపారి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
2021 ఏప్రిల్ 2న పప్పూ యాదవ్ తన నుంచి రూ.10 లక్షల సొమ్ము డిమాండ్ చేశాడని, 2023లోనూ దుర్గాపూజ సందర్భంగా రూ.15 లక్షల నగదుతోపాటు రెండు సోఫా సెట్లు కావాలన్నాడని ఆ వ్యాపారి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా వ్యాపారి ఫిర్యాదుపై ఎంపీ పప్పూ యాదవ్ ఇంతవరకు స్పందించలేదు. కాగా ఈ ఎన్నికల్లో పప్పూయాదవ్కు 5.67 లక్షలకుపైగా ఓట్లు రాగా.. తన సమీప ప్రత్యర్థి, జేడీయూ అభ్యర్థికి 5.43 లక్షల ఓట్లు వచ్చాయి.