Road Accident: కర్ణాటకలోని హవేరీలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై ఆగివున్న లారీని వెనుక నుంచి వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్లో ఉన్న 13 మంది మృతిచెందారు. హవేరి జిల్లా బాద్గి తాలూకాలోని గుండెనహళ్లి క్రాస్ సమీపంలో పూణె-బెంగళూరు జాతీయ రహదారిపై ఈ ఘోర ప్రమాదం జరిగింది.
స్థానికులు ఇచ్చిన సమాచారంలో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గురైన వాహనంలో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టానికి పంపించారు. మృతులు షిమోగా జిల్లా భద్రావతి తాలూకాలోని హోలెహోన్నూరు సమీపంలోని ఎమ్మిహట్టి గ్రామానికి చెందిన వారని పోలీసులు తెలిపారు.
కలబురగి జిల్లాలోని చించోలి మాయమ్మను దర్శించుకుని స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. చనిపోయిన 13 మందిలో ఒక చిన్నారి కూడా ఉంది. సంఘటనా స్థలాన్ని హవేరి ఎస్పీ అన్షుకుమార్ పరిశీలించారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసు సిబ్బంది వాహనంలోంచి మృతదేహాలను బయటకు తీశారని ఆయన తెలిపారు. మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారిగా తెలిసిందని చెప్పారు.