Duplex Mud House | మట్టి గుడిసెలు అందరికీ సుపరిచితమే. ఎందుకంటే గుడిసెలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక దశలో జీవనం కొనసాగించే ఉంటారు. అయితే ఈ గుడిసెల నిర్మాణం మట్టితో పాటు ఈత, తాటి ఆకులతో కప్పబడి ఉంటుంది. ఎండాకాలంలో ఎంతో చల్లగా ఉంటాయి గుడిసెలు. అలా మంచంపై వాలితే క్షణాల్లో నిద్రలోకి జారుకోవాల్సిందే.
అయితే ఓ గ్రామంలో మాత్రం.. ఓ మట్టి గుడిసె డూప్లెక్స్లో దర్శనమిచ్చింది. డూప్లెక్స్ గుడిసె ఏంటి..? అది కూడా మట్టితో నిర్మించడమంటే.. మీకు ఆశ్చర్యం కలగొచ్చు. కానీ అది నిజం. మరి ఆ గుడిసె గురించి తెలుసుకోవాలంటే మధ్యప్రదేశ్ వెళ్లాల్సిందే.
ఓ ట్రావెల్ వ్లోగర్.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తూ.. ఖజురహో గ్రామంలోకి ప్రవేశించింది. దాహంగా ఉండడంతో ఓ ఇంటి వద్ద ఆమె తన వాహనాన్ని నిలిపింది. అక్కడున్న ఓ ఆవిడను చల్లటి నీళ్లు ఉంటే ఇవ్వండని ఆ యువతి అడిగింది. నీళ్లు ఇస్తానని చెప్పి తన మట్టి గుడిసెలోకి తీసుకెళ్లింది ఆమె.
ఇక గుడిసెలోకి అడుగుపెట్టిన ఆ వ్లోగర్ షాక్ అయింది. ఇరుకుగా ఉన్న ఆ మట్టి గుడిసెపై మరో గుడిసె ఉండడంతో ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇక కింది గుడిసెలోని ఒక దిశ నుంచి పై గుడిసెలోకి మెట్లను కూడా ఏర్పాటు చేసుకున్నారు. పై అంతస్తు గుడిసెలో బెడ్రూం ఏర్పాటు చేసుకున్నారు. ఆ డూప్లెక్స్ గుడిసెను చూస్తే చాలా ముచ్చటనిపిస్తోంది. ఆ ఇంటి యజమానురాలి తెలివికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ఇక ఆ గ్రామంలో 47 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయితే.. ఆ డూప్లెక్స్ మట్టి గుడిసెలో మాత్రం 20 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు మాత్రమే నమోదు అయ్యాయి. అంటే ఆ మట్టి గుడిసె ఎంత చల్లగా ఉందో అర్థమవుతుంది. ఇక ఈ గుడిసె కనీసం 200 ఏండ్లపాటు చెక్కు చెదరకుండా ఉంటుందట. అదే కాంక్రీట్ ఇండ్లు అయితే 40 ఏండ్లకు మించి స్థిరంగా ఉండలేవు అని ఆ గుడిసె యజమానురాలు చెప్పుకొచ్చింది.