న్యూఢిల్లీ : రసాయన శాస్త్రంలో విశేష పరిశోధనలు జరిపిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది నోబెల్ బహుమతి లభించింది. మెటల్-ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్ అభివృద్ధి చేసినందుకు గాను సుసుము కిటాగవా, రిచర్డ్ రాబ్సన్, ఒమర్ ఎం. యాఘీలకు ఈ పురస్కారాన్ని అందించనున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది. వీరు కొత్తరకం మాలిక్యూలర్ ఆర్కిటెక్చర్ అభివృద్ధి చేసినట్లు తెలిపింది. 1901-2024 మధ్యకాలంలో 116 సార్లు రసాయన శాస్త్రంలో నోబెల్ను ప్రకటించగా ఇప్పటివరకు 195 మంది దీనిని అందుకోవడం గమనార్హం. జాన్ బీ గూడ్ఎనఫ్ 97 ఏళ్ల వయసులో రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారం అందుకోగా..ఫ్రెడెరిక్ జొలియట్ 35ఏళ్ల వయసులో నోబెల్ అందుకున్న అతిపిన్న వయస్కుడిగా నిలిచారు. ఇక ఫ్రెడరిక్ సాంగెర్, బ్యారీ షార్ప్లెస్లు రసాయన శాస్త్రంలో రెండుసార్లు నోబెల్ అందుకోవడం విశేషం.
సోమవారం నుంచి మొదలైన నోబెల్ పురస్కారాల ప్రకటన అక్టోబర్ 13 వరకు కొనసాగనుంది. తొలి రోజు వైద్యశాస్త్రంలో, మంగళవారం భౌతికశాస్త్రంలో విజేతలను ప్రకటించగా.. బుధవారం రసాయనశాస్త్రంలో నోబెల్ గ్రహీతల పేర్లు వెల్లడించారు. గురువారం సాహిత్యం, శుక్రవారం శాంతి బహుమతి, అక్టోబర్ 13న అర్థశాస్త్రంలో ఈ పురస్కారం అందుకోనున్న వారి పేర్లను ప్రకటిస్తారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి రోజైన డిసెంబర్ 10న విజేతలకు అవార్డులను అందజేస్తారు.