విధాత : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రధాని నరేంద్ర మోదీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయని.. అందుకే నిన్న మొన్నటి వరకు కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి మనపై విమర్శలు చేశారని.. ఇప్పుడు ఏకంగా ప్రధాని మోదీనే రంగంలోకి దిగారని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నోవాటెల్ లో జరిగిన సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. వర్గీకరణ మోదీకి గుదిబండగా మారిందని..కులగణన మోదీకి మరణశాసనం రాయబోతోందన్నారు. దేశంలో తెలంగాణ మోడల్ పై చర్చ జరుగుతోందని..అందుకే తెలంగాణలో కాంగ్రెస్ ను ఇబ్బంది పెట్టాలని బీజేపీ, బీఆరెస్ ఒక్కటయ్యాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సన్న బియ్యం క్రెడిట్ కేంద్రానిదే అంటున్న బీజేపీ ఆ పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. సన్న బియ్యం మన పథకం..,మన పేటెంట్,మన బ్రాండ్ అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు సూచించారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని కొన్ని సమస్యలకు మన ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిందన్నారు. సన్నబియ్యం పథకం ఒక అద్భుతమని..ఆనాడు రూ.2 కిలో బియ్యంలా ఇప్పుడు సన్నబియ్యం పథకం శాశ్వతంగా గుర్తుండే పథకమని రేవంత్ చెప్పారు. ధరణి స్థానంలో తెచ్చిన భూ భారతిని రైతులకు చేరవేయడంలో ఎమ్మెల్యేలు, కేడర్ చొరవ తీసుకోవాలన్నారు. దేశంలోనే ఇందిరమ్మ ఇండ్లు పథకం ఆదర్శంగా నిలిచిందని, క్షేత్ర స్థాయిలో నిజమైన లబ్ది దారులకు ఇందిరమ్మ ఇండ్లు అందించాలన్నారు. కులగణన ద్వారా వందేళ్ల సమస్యను శాశ్వతంగా పకడ్బందీగా పరిష్కరించామని, విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని బిల్లులు తీసుకొచ్చామని, జఠిలమైన ఎస్సీ ఉపకులాల వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామని, అందుకే వర్గీకరణ జరిగే వరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు. ఇవన్ని మన పారదర్శక పాలనకు నిదర్శనమన్నారు. మనం తీసుకున్న గొప్ప నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
16నుంచి జూన్ 2వరకు గ్రామాలకు ఎమ్మెల్యేలు
ఈనెల 16నుంచి జూన్ 2 వరకు ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ప్రతీ గ్రామం పర్యటించేలా కార్యాచరణ తీసుకోవాలని రేవంత్ రెడ్డి కోరారు. నేను కూడా మే 1 నుంచి జూన్ 2 వరకు ప్రజలతో మమేకం అవడానికే సమయం కేటాయిస్తానని తెలిపారు. హెచ్ సీ యూ భూములపై ప్రతిపక్షం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో ఒక అబద్ధపు ప్రచారం చేసిందన్నారు. ఈ ప్రచారాన్ని ప్రధాని మోదీ కూడా నమ్మి బుల్డోజర్లు పంపిస్తున్నారని మాట్లాడుతున్నారన్నారు. బీజేపీ, బీఆరెస్ కలిసి ప్రజా ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నాయని రేవంత్ రెడ్డి విమర్శించారు. పార్టీ, ప్రభుత్వం ప్రతిష్ఠ పెరిగితేనే భవిష్యత్ ఉంటుందన్నారు. మనం ఎంత మంచి చేసినా.. ప్రజల్లోకి తీసుకెళ్లకపోతే ప్రయోజనం ఉండదన్నారు. మళ్లీ గెలవాలంటే ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లాలి.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. మీ నియోజకవర్గంలో ఏం కావాలో ఒక నివేదిక తయారు చేసుకోండని..ఆ పనులను పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులకు మొదటి విడతగా లక్ష రూపాయల విలువైన చెక్కులను సీఎం రేవంత్ రెడ్డి అందించారు. సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు,ఎమ్మెల్సీ లు ఎమ్మెల్యేలు,ఎంపీలు పాల్గొన్నారు.