విధాత, హైదరాబాద్ : కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి వెంటనే రిజర్వాయర్లు నింపాలంటూ రాష్ట్ర ఇగిరేషన్ శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి టి. హరీష్ రావు లేఖ రాశారు. రిజర్వాయర్లలో నీటిని సకాలంలో నింపకపోవడం వల్ల పంటల సాగు ముందుకు పోక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని తన లేఖలో హరీష్ రావు పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో వివిధ జిల్లాలోని రిజర్వాయర్లు మిడ్ మానేరు, అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్లను నింపి, సుమారు 5 లక్షల ఎకరాల ఆయకట్టు పరిధిలోని రైతుల ప్రయోజనాల దృష్ట్యా, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ప్యాకెజ్-6 వద్ద గల మోటార్లను ఆన్ చేసి నీటి పంపింగ్ చేయాలని హరీష్ రావు లేఖలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఇటీవల ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో వచ్చే ప్రతి నీటి చుక్కని ఒడిసి పట్టడం కోసం సకాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు పంప్ లను ఆన్ చేయాలని రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నట్లుగా హరీష్ రావు పేర్కొన్నారు.
నీటి లభ్యత ఉంది…రైతాంగానికి అందించండి
కాళేశ్వరం ప్రాజెక్టు అంతర్భాగమైన శ్రీ పాద ఎల్లంపల్లి రిజర్వాయర్ పూర్తి నీటి సామర్థ్యం 20 టీఎంసీలు ప్రస్తుత సుమారు 14 టీఎంసీల నీటి లభ్యత ఉన్నది, కడెం నుండి దాదాపు 22,300 క్యూసెక్కుల వరద ఉందని..అదేవిధంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో పూర్తి నీటి సామర్థ్యం 80 టీఎంసీలు, ప్రస్తుతం సుమారు 45 టీఎంసీల నీటి లభ్యత ఉన్నదని హరీష్ రావు లేఖలో వివరించారు. అదేరకంగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వలన గోదావరిలో ఇన్ ఫ్లో పెరిగిన విషయం మీకు తెలిసిందేనని గుర్తు చేశారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని ప్యాకెజ్-6 వద్ద గల నంది పంప్ హౌస్లోని మోటార్లను ఆన్ చేసి నీటి పంపింగ్ ప్రారంభించి తద్వారా కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మిడ్ మానేరు, అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ తదితర రిజర్వాయర్ లను నింపాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
5లక్షల ఎకరాల సాగుకు పంపింగ్ ప్రారంభించండి
ఆయా రిజర్వాయర్ల పరిధిలోని చెరువులను, చెక్ డ్యామ్లను అన్నింటిని నింపి సుమారు 5 లక్షల ఎకరాలకు నీరందించేలా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నీటి పంపింగ్ చేపట్టాలని రైతుల పక్షాన కోరుతున్నామని హరీష్ రావు తెలిపారు. అదేవిధంగా లోయర్ మానేరు డ్యామ్ పూర్తి నీటి సామర్థ్యం 24 టీఎంసీలు, ప్రస్తుత నీటి లభ్యత 7 టీఎంసీలు ఉన్నాయని, మిడ్ మానేరు నుండి లోయర్ మానేరు కు నీటిని నింపి ఎస్సార్ఎస్పీ స్టేజ్-2 లోని అవసరమగు ఆయకట్టుకు ఖరీఫ్, రబీ పంటకు నీరు అందించి రైతులను అదుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత యాసంగి పంటలో కాళేశ్వరం ప్రాజెక్టులోని రిజర్వాయర్ల ఆయకట్టు పరిధిలో 5 లక్షల ఎకరాలు సాగు అయిన విషయం గుర్తించి, ఈ వానాకాలం పంట, వచ్చే యాసంగి పంటకు కూడా సాగునీరు అందించేలా వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టు అంతర్భాగంలోని అన్ని రిజర్వాయర్లు నింపి, తద్వారా వాటి అనుసంధానంగా నిర్మించిన కాలువలు, చెరువులు చెక్ డ్యామ్ల ద్వారా రైతులకు నీళ్లు అందించేందుకు రాజకీయాలకు అతీతంగా నీటి పంపింగ్ ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని హరీష్ రావు కోరారు.