విధాత : ఇటీవల జరిగిన భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్ఐ) ఎన్నికల్లో గెలిచిన కొత్త ప్యానెల్ను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసింది. ఈ ప్యానెల్ క్రీడా మంత్రిత్వ శాఖ విధివిధానాలను అతిక్రమించిన కారణంగా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ సస్పెన్షన్ అమల్లో ఉంటుందని తెలిపింది. డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత అండర్-15, అండర్-20 జాతీయ పోటీలను ఉత్తరప్రదేశ్లోని గోండాలో నిర్వహించనున్నట్లు సంజయ్ సింగ్ ప్రకటించారు. ఈ పోటీలకు సిద్ధమయ్యేందుకు రెజ్లర్లకు తగిన సమయం ఇవ్వకుండా నిబంధనలకు విరుద్ధంగా ప్రకటన వెలువరించిన కారణంగా కొత్త ప్యానెల్ను సస్పెండ్ చేసినట్లు క్రీడా మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.
కాగా డబ్ల్యుఎఫ్ఐ ప్యానల్ను సస్పెండ్ చేయడంపట్ల రెజ్లర్లు, క్రీడాకారులు, అభిమానుల నుంచి పెద్ద ఎత్తున సామాజిక మాద్యమాల్లో హర్షాతీరేకాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్న బీజేపీ ఎంపీ ఆదివారం పార్టీ జాతీయ అధ్యక్షడు జేపీ నడ్డాతో భేటీ పిదప తాను రెజ్లింగ్ వ్యవహారాలకు రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లుగా ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. తాను ఇక మీదట రెజ్లింగ్ వ్యవహారాలకు దూరంగా ఉండనున్నట్లుగా ప్రకటించారు.
కాగా డబ్ల్యుఐఎఫ్ ప్యానల్ను సస్పెండ్ చేస్తూ కేంద్రం ఆలస్యంగా నిర్ణయం తీసుకున్నప్పటికీ రెజ్లర్లకు న్యాయం జరుగుతుందనే ఆశను కలిగించిందని గీతా పొగట్ ట్వీట్ చేశారు. అమ్మాయిలు రెజ్లింగ్కు దూరమయ్యేలా చేసి, అబ్బాయిలు పద్మశ్రీని వెనక్కిచ్చేలా చేసిన రెజ్లింగ్ సమాఖ్యను రద్దు చేశారని, ఇదే ముందే చేసుండాల్సిందని అని బాక్సర్ విజయేందర్ సింగ్ ట్వీట్ చేశాడు.
రెండు రోజుల క్రితం నిర్వహించిన డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల్లో వివాదస్పద బ్రిష్ భూషణ్ సింగ్ సన్నిహితుడైన సంజయ్ సింగ్ ఎన్నిక కావడాన్ని భారత స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ సహా కొందరు వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే ఆయన ఎన్నిక తీవ్ర నిరాశకు గురిచేసిందని, దీనికి నిరసనగా తాను రెజ్లింగ్ నుంచి వైదొలుగుతున్నట్లు సాక్షి ప్రకటించారు. ఆమెకు మద్దతుగా బజరంగ్ పునియా పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కిచ్చేశాడు. ఇదే క్రమంలో డెప్లింపిక్స్ (బదిరుల ఒలింపిక్స్) పసిడి విజేత వీరేందర్ సింగ్ యాదవ్ కూడా పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేస్తానని శనివారం ప్రకటించడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన ప్యానెల్ను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేయడంపై హర్షాతీరేకాలు వ్యక్తమవుతున్నాయి.