BSNL Data : ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) యూజర్ల డేటా మరోసారి ప్రమాదంలో పడింది. ఆ నెట్వర్క్ వినియోగదారుల వ్యక్తిగత డేటా మరోసారి లీకైంది. గత ఆరు నెలల్లో కస్టమర్ల డేటా హ్యాక్ అవ్వడం ఇది రెండోసారి. ఈ డాటాలో సిమ్ కార్డ్ వివరాలు, అంతర్జాతీయ మొబైల్ చందాదారుల గుర్తింపు (IMSI), హోమ్ లొకేషన్ లాంటి సమాచారం ఉన్నట్లు అథెంటియన్ టెక్నాలజీస్ పేర్కొంది.
బీఎస్ఎన్ఎల్కు చెందిన 278 జీబీ డాటా తన దగ్గర ఉందంటూ కిబర్ ఫాంటోమ్ అనే వ్యక్తి 5000 డాలర్లకు అమ్మకానికి పెట్టాడని అథెంటియన్ టెక్నాలజీస్ తన నివేదికలో పేర్కొంది. నకిలీ సిమ్ కార్డులను సృష్టించడానికి ఈ డేటా దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ వివరాలను ఉపయోగించి యూజర్ల వ్యక్తిగత ఖాతాలను నేరగాళ్లు అనధికారికంగా యాక్సెస్ చేయడం, సైబర్ దాడులు, మోసాలకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
గతేడాది డిసెంబర్లో ఇలానే బీఎస్ఎన్ఎల్ ఫైబర్, ల్యాండ్లైన్ యూజర్ల డాటా బయటకు పొక్కింది. మరోవైపు దేశవ్యాప్తంగా 4జీ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు బీఎన్ఎస్ఎల్ సిద్ధమవుతోంది. ఈ తరుణంలో డాటా హ్యాక్కు గురవ్వడం ఆందోళన రేపుతోంది. ఈ తరహా డాటా లీకేజీ వల్ల కంపెనీలు వినియోగదారుల నమ్మకాన్ని కోల్పోవడంతో పాటు న్యాయపరమైన చిక్కులూ ఎదుర్కోవాల్సి ఉంటుందని సైబర్ నిపుణులు చెబుతున్నారు.