హైదరాబాద్ : తెలంగాణలో సాయంత్రం 5 గంటల వరకు 61.16 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి సాయంత్రం వరకు ఉత్సాహంతో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు అత్యధికంగా భువనగిరి పార్లమెంట్ పరిధిలో 72.34 శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా హైదరాబాద్లో 39.17 శాతం పోలింగ్ నమోదైంది.
ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో 69.81 శాతం, భువనగిరిలో 72.34 శాతం, చేవెళ్లలో 53.15 శాతం, హైదరాబాద్లో 39.17 శాతం, కరీంనగర్లో 67.67 శాతం, ఖమ్మంలో 70.76 శాతం, మహబూబాబాద్లో 68.60 శాతం, మహబూబ్నగర్లో 68.40 శాతం, మల్కాజ్గిరిలో 46.27 శాతం, మెదక్లో 71.33 శాతం, నాగర్కర్నూల్లో 66.53 శాతం, నల్లగొండలో 70.36 శాతం, నిజామాబాద్లో 67.96 శాతం, పెద్దపల్లిలో 63.86 శాతం, సికింద్రాబాద్లో 42.48 శాతం, వరంగల్లో 64.08 శాతం, జహీరాబాద్లో 71.91 శాతం పోలింగ్ నమోదైంది.
13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగింటికే ముగిసిన పోలింగ్
తెలంగాణలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసింది. సాయంత్రం 4 గంటలకు క్యూలైన్లలో నిల్చున్న వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. మిగిలిన 106 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 6 గంటలకు పోలింగ్ కొనసాగింది.
మహబూబాబాద్, పెద్దపల్లి, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని సమస్యాత్మకమైన 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై.. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. సిర్పూర్, ఆసిఫాబాద్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లెందు, భద్రాచలం, కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రక్రియ ముగిసింది.