Bandi Sanjay | ఫోన్ ట్యాపింగ్‌పై మ్యాచ్ ఫిక్సింగ్ అనుమానాలు: బండి సంజయ్

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాజకీయ ప్రయోజనాల నేఫథ్యంలో విచారణ జరుగకుండా ఢిల్లీ స్థాయిలో కాంగ్రెస్ హైకమాండ్‌కు, కేసీఆర్‌కు మధ్య మ్యాచ్‌ఫిక్సింగ్ జరిగినట్లుగా అనుమానాలున్నాయని అందుకే దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని సీఎం రేవంత్‌రెడ్డికి కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ లేఖ రాశారు.

  • Publish Date - June 1, 2024 / 03:10 PM IST

సీబీఐ విచారణ కోరండి
చిత్తశుద్ధి నిరూపించుకోండి
సీఎం రేవంత్‌రెడ్డికి ఎంపీ బండి లేఖ

విధాత: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాజకీయ ప్రయోజనాల నేఫథ్యంలో విచారణ జరుగకుండా ఢిల్లీ స్థాయిలో కాంగ్రెస్ హైకమాండ్‌కు, కేసీఆర్‌కు మధ్య మ్యాచ్‌ఫిక్సింగ్ జరిగినట్లుగా అనుమానాలున్నాయని అందుకే దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని సీఎం రేవంత్‌రెడ్డికి కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ లేఖ రాశారు. కాళేశ్వరం మాదిరిగానే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరగకుండా అటకెక్కించే కుట్రలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ఈ రెండు అంశాలపై విచారణ జరిగితే కేసీఆర్, కేటీఆర్ జైలుకు వెళ్లక తప్పదని బండి సంజయ్ పేర్కోన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరగకుండా ఢిల్లీ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిళ్లు వచ్చినట్లుగా, భారీ ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు తమ దృష్టికి వచ్చిందని బండి సంజయ్ ఆరోపించారు.

ఫోన్ ట్యాపింగ్ కారకులు కేసీఆర్, కేటీఆర్ లకు నోటీసులిచ్చి విచారిస్తే రాష్ట్ర దర్యాప్తు సంస్థల విశ్వసనీయత పెరిగేదని, ఆ పని చేయకపోవడంవల్లే సీబీఐ విచారణ కోరుతున్నామన్నారు. ఫోన్ ట్యాపింగ్ అత్యంత తీవ్రమైన నేరమని, ప్రజాప్రతినిధులకు రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రసాదించిన హక్కులను కూడా ఫోన్ ట్యాపింగ్ తో కాలరాశారన్నారు. భార్యాభర్తలు మాట్లాడుకునే అంశాలను కూడా ట్యాపింగ్ చేసి వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడ్డారని, ఫోన్ ట్యాపింగ్ తో వ్యాపారులు, బిల్డర్లు, పారిశ్రామికవేత్తలుసహా పలువురు సెలబ్రిటీలను బెదిరించి డబ్బులు వసూలు చేయడంతోపాటు తమ అవసరాలను తీర్చుకున్నారని సంజయ్ తన లేఖలో వివరించారు. ఫోన్ ట్యాపింగ్ కోసం విదేశాల నుండి అక్రమంగా ప్రత్యేకంగా పరికరాలు తెప్పించారని, బీఆరెస్‌ ఓడిపోయాక ఫోన్ ట్యాపింగ్ పరికరాల ధ్వంసం పేరుతో దేశ భద్రతకు, ఉగ్రవాదులకు సంబంధించిన కీలకమైన సమాచార డేటాను కూడా ధ్వంసం చేశారని, వ్యాపార సంస్థలు ప్రతిపక్షాలకు విరాళాలు ఇవ్వకుండా ఫోన్ ట్యాపింగ్‌ను వాడుకున్నారని లేఖలో గుర్తు చేశారు.

ఫోన్ ట్యాపింగ్ ప్రధాన సూత్రధారి ప్రభాకర్ రావు అమెరికాలో తలదాచుకున్నా ఎందుకు స్వదేశానికి రప్పించలేకపోయారని, ఫోన్ ట్యాపింగ్ పై వాస్తవాలు నిగ్గు తేలాలంటే సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు జోక్యం అనివార్యమని, మీరే సీబీఐ విచారణ జరపాలని కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా గత ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయండని సీఎం రేవంత్‌రెడ్డిని సంజయ్ కోరారు. ప్రతిపక్షాలపై సైబర్ దాడికి కారకుడైన మాజీ సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ లకు నోటీసులిచ్చి విచారణ జరిపి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి రాజ్యాంగ హక్కులనే ఉల్లంఘించిన కేసీఆర్ ను, కేటీఆర్‌ను ఎమ్మెల్యే పదవులకు అనర్హులుగా ప్రకటించాలని, తెలంగాణ శాసనసభా నాయకుడిగా ఉన్న మీరు కేసీఆర్, కేటీఆర్ లను అనర్హులుగా ప్రకటించే విషయంపై స్పీకర్ కు లేఖ రాయాలని సంజయ్ సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు.

Latest News