Site icon vidhaatha

KTR | వచ్చే నెల 2వ తేదీలోగా కాళేశ్వరం జలశయాలు నింపాలి.. లేదంటే: కేటీఆర్

50వేల మందితో వచ్చి తామే పంప్‌హౌస్‌లు ఆన్ చేస్తాం
బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
రైతుల మీద కాంగ్రెస్ రాజకీయం బంద్ చేయాలి
కాళేశ్వరం రైతుల సమస్యలపై అసెంబ్లీలో నిలదీస్తాం
కేసీఆర్‌ను బద్నాం చేసేందుకే నీళ్లు ఎత్తిపోయకుండా రైతులకు అన్యాయం చేసున్నారు

విధాత, హైదరాబాద్ : వచ్చే నెల 2వ తేదీ లోపు కాళేశ్వరం పరిధిలోని జలాశయాల్లో నీటిని నింపాలని, ప్రభుత్వం స్పందించకపోతే కేసీఆర్ నాయకత్వంలో 50 వేల మంది రైతులతో వచ్చి తామే పంప్‌హౌస్‌లు ఆన్‌ చేస్తామని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుల సందర్శనలో తొలి రోజు లోయన్ మానేరు డ్యామ్‌ను సందర్శించిన కేటీఆర్ సారధ్యంలోని బీఆరెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం రెండో రోజు శుక్రవారం కన్నెపల్లి, లక్ష్మిపంప్‌హౌస్‌లను, మేడిగడ్డ బ్యారేజీని సందర్శించారు. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ధ గోదవరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల కోసం ప్రజలు, రైతులను ఇబ్బందులు పెట్టొద్దన్నారు. కేవలం రాజకీయ కక్షతో, కేసీఆర్‌ను బద్నాం చేయాలనే కాళేశ్వరం పరిధిలోని పంప్‌లను ఆన్‌ చేయడం లేదని విమర్శించారు. ఎన్నికలు అయిపోయాయని, ఇకనైనా రాజకీయాలకు స్వస్తి పలికి రైతుల మీద రాజకీయం బంద్ చేసి వారికి సాగునీటిని అందించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లోపు కాళేశ్వరం పంప్‌హౌస్‌లు ఆన్‌ చేయాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ కల్పతరువన్నారు. కేసీఆర్‌ ఆదేశాల మేరకు బీఆరెస్‌ ప్రజాప్రతినిధులం ప్రాజెక్టును పరిశీలించామని చెప్పారు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయనంత వేగంగా కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్‌ నిర్మించారు.

తెలంగాణలో కరువు అనే మాట వినపడొద్దని ఈ ప్రాజెక్టును నిర్మించారు. బీఆరెస్‌ పాలనలో ఎప్పుడూ నీటి సమస్య లేదని, గతంలో నీటి సమస్య ఉండేదని రాష్ట్ర ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తున్నదని కేటీఆర్ విమర్శించారు. ఈ ప్రభుత్వం పంటల సాగు కోసం నీరు ఇచ్చే పరిస్థితి లేదని, ఎల్‌ఎండీలో 5 టీఎంసీలు మాత్రమే ఉన్నాయని, మిడ్‌ మానేరులోనూ 5 టీఎంసీలు మాత్రమే ఉన్నాయని, శ్రీరాంసాగర్‌ సామర్థం 90 టీఎంసీలు అయితే ఇప్పుడు 25 టీఎంసీలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కరువు ప్రాంతాలకు సాగునీరు అందుతుందని, హైదరాబాద్‌కు కూడా మంచినీళ్లు అందించొచ్చున్నారు. 15 టీఎంసీలతో కొండ పోచమ్మ సాగర్‌ కట్టుకున్నామని, 50 టీఎంసీలతో మల్లన్న సాగర్‌ కట్టుకున్నామని, లక్ష్మీ పంప్‌హౌస్‌ నుంచి నీటిని ఎత్తిపోయవచ్చుని తెలిపారు.

వృధాగా పోతున్న గోదావరి నీళ్లు..గొంతెండిన రిజర్వాయర్లు

కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో మూడు రోజులకు ఒకసారి తాగునీరు అందిస్తున్నారని, పది లక్షల క్యూసెక్కుల నీరు వృధాగా కిందకు పోతున్నాయని, కాళేశ్వరం దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నదని, అటు రిజర్వాయర్లు మాత్రం గొంతెండి ఎడారిలాగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం వంటి గొప్ప సిస్టమ్‌ రూపొందించడం మరొకరి వల్ల కాదని, 17 పంపులు రెడీగా ఉన్నాయని, రోజుకు 2 టీఎంసీలు ఎత్తిపోయవచ్చని, రాజకీయ పరమైన నిర్ణయం వల్లే నీటిని ఎత్తిపోయడంలేదన్నారు. ప్రభుత్వం తలచుకుంటే 18 లక్షల ఎకరాలకు నీళ్లివ్వొచ్చని, నీళ్లు సముద్రంలోకి వృధాగా పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.

బస్వాపూర్‌, కొండపోచమ్మ, రంగనాయకసాగర్‌, మల్లన్న సాగర్‌ రైతులు నీటికోసం ఎదురుచూస్తున్నారని, తుంగతుర్తి, కోదాడ, సూర్యాపేట వరకు రైతులు కాళేశ్వర జలాల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఆరు నెలలు రాజకీయం చేద్దాం.. నాలుగున్నరేండ్లు ప్రజల కోసం కష్టపడి పనిచేద్దామని హితవు పలికారు. నీటిని లిఫ్ట్‌ చేస్తే రెండు రోజుల్లో మిడ్‌ మానేరుకు చేరుకుంటాయని, కొండపోచమ్మ, మల్లన్నసాగర్‌, రంగనాయకసాగర్‌, అన్నపూర్ణ రిజర్వాయర్లు నింపవచ్చన్నారు. మిడ్‌మానేరు గత ఐదారేండ్లు నిండుగా ఉందని, ఇప్పుడు ఎడారిగా మారిందన్నారు. పంప్‌హౌస్‌లపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అసెంబ్లీలో నిలదీస్తాం

కేసీఆర్‌ను బద్నాం చేసేందుకు కాంగ్రెస్‌ చిల్లర ప్రయత్నాలు చేస్తున్నదని, అవన్ని గోదావరి వరదలో కొట్టుకపోయాయని, ప్రజలకు ఈ విషయాలన్నీ అర్ధమైపోయినయని, రైతుల పక్షాన అసెంబ్లీలో చర్చకు డిమాండ్ చేస్తామన్నారు. కాళేశ్వరంలో పరిధిలో రిజర్వాయర్లలో నీటిని నింపడానికి ప్రభుత్వానికి ఆగస్టు 2 వరకు గడువిస్తున్నామని, సర్కార్ స్పందించకపోతే 50 వేల రైతులతో తామే పంపులు ఆన్ చేస్తామని, తెలంగాణ బీడు భూములకు నీళ్లు అందిస్తామని ప్రకటించారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని అసెంబ్లీలో నిలదీస్తామని, రాజకీయాల కోసం ప్రజలు, రైతులను ఇబ్బందులు పెట్టొద్దన్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు అని ప్రపంచమంతా గుర్తించిందని, ఎందరో మేధావులు కాళేశ్వరం గొప్పతనాన్ని ప్రశంసించారని, చిన్న సమస్య తలెత్తితే ప్రాజెక్టుపై విష ప్రచారం చేస్తున్నారని, మహారాష్ట్రతో ఒప్పందం చేసుకుని అద్భుతమైన ప్రాజెక్టును నిర్మించామన్నారు. కేసీఆర్‌ ఇంతగొప్ప ప్రాజెక్టును నిర్మిస్తే వాడుకునే తెలివి కాంగ్రెస్‌కు లేదని కేటీఆర్‌ విమర్శించారు. అన్నారం, సుందిళ్లపై కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారం చేసిందని, గ్రౌడింగ్ అనేది నిరంతరం ప్రక్రియ, 2020లోనూ చేశామని ఇంజినీర్లు చెప్పారని, రైతుల మీద కాంగ్రెస్‌ రాజకీయాలు బంద్ చేసి కాళేశ్వరం పరిధిలోని ఆయకట్టు రైతులకు నీళ్లందించాలని హితవు పలికారు.

Exit mobile version