విధాత, హైదరాబాద్ : ధరణి ఫోర్టల్లో మార్పులు, చేర్పులపై అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించి అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అన్నారు. రైతులు, ప్రజల అభిప్రాయాలు, సూచనల ఆధారంగా సమగ్ర చట్టం రూపొందించాలని స్పష్టం చేశారు. తెలంగాణలో ధరణి సమస్యల పరిష్కారానికి మరింత లోతుగా అధ్యయనం చేయాలని రెవెన్యూ శాఖను ఆయన సూచించారు. ఇవాళ సచివాలయంలో రేవంత్ రెడ్డి ధరణి పోర్టల్ పై రెవెన్యూ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతిపాదించనున్న సవరణలపై కొత్త సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
ప్రభుత్వం తీసుకురానున్నా సవరణలపై ప్రజాభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. భూ యజమానులు, రైతులకు నిద్రలేకుండా చేస్తున్న ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు. ధరణి ఫోర్టల్ లో తలెత్తున్న సమస్యలు, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులు, రెవెన్యూ సిబ్బంది పాట్లపై అవసరమైతే అసెంబ్లీలోనూ చర్చ పెడదామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, మాజీ మంత్రి కె.జానారెడ్డి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, సిసిఎల్ఏ నవీన్ మిట్టల్, సునీల్ కుమార్, మాజీ ఐఏఎస్ రేమండ్ పీటర్, మాజీ ఎమ్మెల్యే ఎం.కోదండ రెడ్డి పాల్గొన్నారు.